అంత ఆశ అవసరమా అనిపిస్తోంది

11 Jul, 2018 00:52 IST|Sakshi

‘‘ఐదుగురు అక్కల తర్వాత పుట్టిన తమ్ముడి కథ ‘చిన బాబు’. తండ్రి వ్యవసాయం చేస్తుంటాడు. కొడుకు కూడా వ్యవసాయమే చేస్తాడు. ఎవరి వృత్తిని వాళ్లు బండిపై రాసుకున్నట్టు ఈ చిత్రంలో నేను ఫార్మర్‌ అని రాసుకుంటాను. రైతు అనే ఉద్యోగాన్ని గర్వంగానే భావించాను’’ అని హీరో కార్తీ అన్నారు. కార్తీ, సాయేషా సైగల్‌ జంటగా పాండిరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చినబాబు’. హీరో, కార్తీ అన్న సూర్య, మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా కార్తీ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు..పాండిరాజ్‌గారు చేసిన ‘పసంగ’ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. అది చిన్న పిల్లలు, తల్లిదండ్రులకు సంబంధించిన సినిమా. పేరెంటింగ్‌ గురించి చెప్పిన సినిమా. ఆయనతో పనిచేయాలని ఎప్పటి నుంచో అనుకుంటుంటే ‘చినబాబు’తో కుదిరింది.

ఈ చిత్రంలో నేను ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ చేస్తూ నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తుంటా. అక్కలకు, వాళ్ల కూతుళ్లకు కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఉండే పాత్ర నాది. మన సంస్కృతిలో పిల్లలు సంపద. అలాంటి సంపదను, కుటుంబ బంధాలను ఇందులో చూపించాం. ఈ సినిమాలోనే నేను తొలిసారి పెద్ద కుటుంబంతో పని చేశా. చాలా మంచి ఫీలింగ్‌ వచ్చింది.  ఈ చిత్రంలో రైతుల కష్టనష్టాలను చూపించడం లేదు. పాజిటివ్‌ సైడ్‌లో చూపిస్తున్నాం. జర్మనీలో ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ చేస్తారు. కేరళలో ఏడాదికి రెండు, మూడు కోట్లు సంపాదిస్తున్నారు. అలాంటి విషయాలను మళ్లీ చెప్పాలనే అంశంతో ఈ సినిమా చేశాం.పాండిరాజ్‌గారు కూడా రైతే. ఆయన చేసి చూపించినవన్నీ నేను చేశా. రోజూ ఉదయం ఆరు గంటలకే పొలాలకు వెళ్లి పనులు చేసేవాణ్ని. వ్యవసాయం ఎక్కడైనా ఒకటే. తెలుగు అయినా తమిళ నాట అయినా.‘రంగస్థలం’ సినిమా తర్వాత నేను గోదావరి యాస ట్రై చేశాను. ఈ సినిమా చూసేవారికి అక్కలు, మావయ్యలు, బావలు కనిపిస్తారు. అందరూ కనెక్ట్‌ అవుతారు. మన కల్చర్‌ని ఈ తరం పిల్లలకు చూపించే సినిమా అవుతుంది. 

నాకు వ్యవసాయం టచ్‌ ఉంది. నా భార్య ఓ రైతు కూతురే. సెలవుల్లో ఆ పల్లెటూరికి వెళ్తాం. నా కూతురు కూడా సెలవుల్లో పల్లెటూళ్లోనే ఉంటుంది. మా పెదనాన్న రైతు. మా నాన్న ఎప్పుడూ ‘ఈ సిటీ బోర్‌ కొడుతోందిరా. నేను ఊరెళ్తున్నాను’ అంటారు. ఆ టచ్‌ మనకూ ఉండాలి. ఉంటుంది కూడా.మా అన్న సూర్యగారు మంచి నిర్మాత. షూటింగ్‌ స్పాట్‌కి ఒక్క రోజు కూడా రాలేదు. సినిమా ఎలా ఉంది? అని అడిగితే, ‘అది ఆడియన్స్‌ చెప్తారు’ అన్నారు. నేను పదేళ్లుగా నటిస్తున్నా. నా నటన నచ్చకపోతే నిర్మాతగా మారతాను. స్టార్టింగ్‌లో దర్శకుడిగా చేయాలనుకున్నా. ఇప్పుడు దర్శకులను, వాళ్లు పడే కష్టాన్ని చూస్తే నాకు నేను ‘అంత ఆశ ఎందుకురా నీకు’ అనుకుంటాను. వయసులో ఉన్నప్పుడే నటించాలి. వయసు మీద పడే కొద్దీ మనం సంపాదించుకున్న జ్ఞానంతో దర్శకత్వం చేయొచ్చు.∙ప్రస్తుతం‘ఆవారా’ లాంటి సినిమా చేస్తున్నా. రకుల్‌ హీరోయిన్‌. వినోద్‌గారు ‘ఖాకీ’ కథ చెప్పినప్పుడు సీక్వెల్‌ చేద్దామన్నారు. ఆయన కథతో వస్తే చేస్తా. మంచి కథ కుదిరితే తెలుగులో డైరెక్ట్‌ సినిమా చేస్తా. మల్టీస్టారర్‌ మూవీస్‌ పెద్దగా ఇష్టం ఉండదు. ‘ఊపిరి’ మంచి కథ. అందుకే చేశా. 

మరిన్ని వార్తలు