పిలిచి అవమానిస్తారా?: ఫ్యాన్స్‌ ఫైర్‌

25 Dec, 2019 15:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సినీ నిర్మాణ సంస్థ​ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై హీరో మహేశ్‌బాబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరో మహేశ్‌బాబుతో ఫొటో దిగడానికి రమ్మని తమను తీవ్రంగా అవమానించారని మండి పడుతున్నారు. స్టార్‌ హీరోకు తగినట్టుగా ఏర్పాట్లు చేయలేదని వాపోయారు. మహేశ్‌బాబుతో ఫొటో దిగాలనుకుంటే గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీకి రావాలని నిర్వాహకులు ఆన్‌లైన్‌లో ప్రచారం చేయడంతో తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో తోపులాట జరిగి పలువురు అభిమానులు గాయపడ్డారు. ఇద్దరికి కాళ్లు విరిగినట్టు తెలుస్తోంది.

బౌన్సర్లు దురుసుగా వ్యవహరించారని, తమపై చేయి చేసుకున్నారని ఫ్యాన్స్‌ ఆరోపించారు. తమను ఎందుకు కొట్టారో అర్థం కావడం లేదని వాపోయారు. అభిమానులను కొట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. రైళ్లో సీట్లు దొరక్కపోయినా రాత్రంతా ప్రయాణం చేసి 30 మందితో కలిసి వచ్చామని, ఇక్కడి వచ్చాక తమను కొట్టి తరిమేశారని ఒక అభిమాని వాపోయాడు. ఎవరి పైరవీలు వాళ్లవి జరుగుతున్నాయని ఆరోపించాడు. కార్యక్రమం రసాభాసగా మారడంతో బ్యారికేడ్లు విరిగిపోయాయి. కోపంతో అభిమానులు కుర్చీలు విరగొట్టారు. అయితే అనుమతి తీసుకుంటే భద్రతా ఏర్పాట్లు చేసేవాళ్లమని పోలీసులు చెబుతున్నారు. అనుమతి తీసుకోకుండా కార్యక్రమం చేపట్టిన నిర్వాహకులపై చందానగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. (మహేశ్‌ ఫొటోషూట్‌లో తొక్కిసలాట..రభస)

మరిన్ని వార్తలు