దేవుడి దయవల్ల క్షేమంగా బయటపడ్డా: రాజశేఖర్‌

13 Nov, 2019 18:48 IST|Sakshi

ప్రముఖ హీరో డాక్టర్‌ రాజశేఖర్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బుధవారం వేకువజామున రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. రామెజీఫిల్మ్‌ సిటీ నుంచి తన కారులో ఇంటికి వస్తుండగా కారు టైరు పగిలి డివైడర్‌ను ఢీకొని, కారు పల్టీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌ స్వల్పగాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఉదయం నుంచి సోషల్‌ మీడియాలో ఈ ప్రమాదంపై అనేక వార్తలు వస్తున్న తరుణంలో రాజశేఖర్‌ మీడియా ముందుకు వచ్చారు.

దేవుడి దయ వల్ల పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డానని ఆయన తెలిపారు. కారు పల్టీలు కొట్టడంతో ఒళ్లు నొప్పులున్నాయి తప్పా పెద్ద గాయాలు కాలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న వారితో పాటు తనపై ప్రేమాభిమానాలు కురిపించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను క్షేమంగా ఉన్నట్లు తెలిపిన రాజశేఖర్‌.. ఎవరూ ఆందోళన పడొద్దని ధైర్యం చెప్పారు.

‘ఈ ప్రమాదం జరిగినప్పట్నుంచి అనేక మంది మెసేజ్‌లు, ఫోన్లు చేసి నా యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. కొంతమంది ఇంటికి వచ్చి పరామర్శిస్తున్నారు. వీరందరి పలకరింపులు, నాపై చూపిస్తున్న ప్రేమ చూస్తేంటే చాలా సంతోషంగా ఉంది.  అయితే ఈ సందర్భంగా మీ అందరికీ ఒక్కటి చెప్పదల్చుకున్నాను. సినిమా ఇండస్ట్రీ అంతా ఒక ఫ్యామిలీ. అయితే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు చనిపోయిన వారి కుటంబసభ్యులను కలవడం కానీ, ప్రమాదాలకు గురై గాయపడ్డ వారిని పలకరించడం వంటివి చేయాలి. లేకపోతే వారి కుటుంబసభ్యులు బాధపడతారు. మనకు సినీ ఇండస్ట్రీలో ఎవరూ లేరా అని నిరుత్సాహపడతారు. అలాగే ఆరోగ్యం బాగోలేని వ్యక్తుల దగ్గరికి వెళ్లి దయచేసి పరామర్శించండి. ధైర్యం నింపండి. డిజిటల్‌ యుగంలో ఉన్నాం.. ఏదైనా జరిగినప్పుడు కనీసం ట్వీట్‌ చేయండి’అంటూ రాజశేఖర్‌ పేర్కొన్నారు.  ఇక రాజశేఖర్‌ పూర్తి సందేశం కింది వీడియోలో..

మరిన్ని వార్తలు