థ్రిల్లింగ్‌ రెడ్‌

31 Oct, 2019 00:07 IST|Sakshi
‘స్రవంతి’ రవికిశోర్, కిశోర్‌ తిరుమల, చార్మి, రామ్, పూరి జగన్నాథ్‌

రామ్‌ హీరోగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘రెడ్‌’. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై కృష్ణ పోతినేని సమర్పణలో ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మించనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. రామ్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు పూరి  జగన్నాథ్‌ క్లాప్‌ ఇచ్చారు. నిర్మాత కిరణ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఈ సందర్భంగా రవికిశోర్‌ మాట్లాడుతూ– ‘‘రామ్‌కు ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి సూపర్‌హిట్‌ అందించిన పూరి జగన్నాథ్‌గారికి థ్యాంక్స్‌. మా బ్యానర్‌లో రామ్‌ ఇప్పటివరకు చాలామంచి సినిమాలు చేశారు. ‘రెడ్‌’ కూడా మరో మంచి చిత్రంగా నిలిచిపోతుందని భావిస్తున్నాను.

నవంబర్‌ 16 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారం భిస్తాం. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 9న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. ఓ సినిమా సోల్‌ను తీసుకుని, అందులో మార్చులు చేసి ‘రెడ్‌’ సినిమాను తెరకెక్కిస్తాం’’ అన్నారు. ‘‘కెరీర్‌లో తొలిసారి థ్రిల్లర్‌ జానర్‌లో సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని రామ్‌ అన్నారు. ‘‘రామ్‌తో మూడోసారి సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. థ్రిల్లర్‌కు వాణిజ్య పరమైన అంశాలు జోడించి కథ, కథనాలు ప్రేక్షకులకు కొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మణిశర్మగారు మా సినిమాకు సంగీతం అందిస్తున్నందుకు చాలా సంతోషం’’ అన్నారు కిశోర్‌ తిరుముల. నిర్మాతలు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, అనిల్‌ సుంకర, రామ్‌ ఆచంట, కృష్ణ పోతినేని పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు