పొల్లాచ్చిలో... కొత్త సినిమా

1 Apr, 2015 22:55 IST|Sakshi
పొల్లాచ్చిలో... కొత్త సినిమా

 ఇప్పటికే రెండు సినిమాలతో బిజీగా ఉన్న యువ కథానాయకుడు రామ్ ముచ్చటగా మూడో సినిమాకు శ్రీకారం చుట్టేశారు. శ్రీస్రవంతీ మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ ఈ కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘హరికథ’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ కొత్త చిత్రం షూటింగ్ బుధవారం మొదలైంది. తమిళనాడులోని పొల్లాచ్చిలో మొదలైన షూటింగ్ ఈ నెల 15 వరకు అక్కడే జరగనుంది. ‘‘చక్కటి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్’’గా నిర్మాత పేర్కొంటున్న ఈ చిత్రంలో రామ్ సరసన కీర్తీ సురేష్ నాయిక. ఈ ఏడాది వచ్చిన తొలి హిట్ ‘రఘువరన్ బి.టెక్’కి మంచి సంభాషణలు అందించిన కిశోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. ‘‘రామ్ పోషించే పాత్ర చాలా ఉత్సాహంగా సాగుతుంది. ఈ షెడ్యూల్‌లో ఒక పాట, కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం’’ అని నిర్మాత రవికిశోర్ పేర్కొన్నారు.
 
  సత్యరాజ్, ప్రదీప్ రావత్, నరేశ్, విజయకుమార్, రోహిణి లాంటి పేరున్న నటీనటులు ముఖ్యపాత్రధారులు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సమీర్‌రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. నిజానికి, ఇప్పటికే ‘శివమ్’ అనే చిత్రాన్ని రామ్ హీరోగా కృష్ణచైతన్య సమర్పణలో రవికిశోర్ నిర్మిస్తున్నారు. అదే నిర్మాత, హీరోల కాంబినేషన్‌లో ఏకకాలంలో రెండో సినిమా కూడా సెట్స్‌పైకి వచ్చింది. మరోపక్క ‘పండగ చేస్కో’లో కూడా రామ్ హీరో. వరుసగా ఇలా మూడు చిత్రాల షూటింగ్‌లతో ఒక యువ హీరో బిజీగా ఉండడం విశేషమే.
 

>