ఆయన్ను మరో అవకాశం అడిగా..

20 Jan, 2018 10:35 IST|Sakshi

సాక్షి, చెన్నై: ప్రియదర్శన్‌ దర్శకత్వంలో నటించడానికి మరో అవకాశం అడిగానని నటుడు ఉదయనిధి స్టాలిన్‌ పేర్కొన్నారు. ఈయన హీరోగా నటించిన తాజా చిత్రం నిమిర్‌. ఈ చిత్రంలో నమితా ప్రమోద్, పార్వతీనాయర్‌ హీరోయిన్‌లుగా నటించారు. ఇందులో ప్రకాష్‌రాజ్, సముద్రఖని, ఎంఎస్‌.భాస్కర్‌. కరుణాకరన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. మూన్‌షాట్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పతాకంపై సంతోష్‌కురువిల్లా నిర్మించిన ఈ చిత్రానికి ప్రియదర్శన్‌ దర్శకుడు. చిత్రం ఈనెల 26న విడుదల కానుంది.  

గురువారం సాయంత్రం ఆడియో ఆవిష్కరణ చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఉదయనిధిస్టాలిన్‌ మాట్లాడుతూ.. నిమిర్‌ చిత్రంలో దర్శకుడు ప్రియదర్శన్‌ చెప్పినట్లు నటించానన్నారు. ఇందులో సముద్రఖనితో మూడు రోజుల పాటు ఫైట్‌ సన్నివేశాల్లో నటించడం మరచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. నిమిర్‌ చిత్ర తొలి కాపీ చూసిన తరువాత మరో చిత్రంలో ఒక పాత్ర ఉన్నా పిలవండి వచ్చి నటిస్తానని దర్శకుడు ప్రియదర్శన్‌ను అడిగానని ఉదయనిధిస్టాలిన్‌ అన్నారు. 

నిర్మాత సంతోష్‌ కురువిల్లా మాట్లాడుతూ.. ప్రియదర్శన్‌ దర్శకత్వంలో చిత్రం నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. తాను చెన్నైలో కార్యాలయం లేకుండానే నిమిర్‌ చిత్రాన్ని పూర్తి చేశానని తెలిపారు. అంతగా రెడ్‌జెయింట్, ఫోర్‌ఫ్రేమ్స్‌ సంస్థలు సహకరించాయని చెప్పారు. ఇకపై ఇక్కడ కార్యాలయాన్ని నెలకొల్సి పలు చిత్రాలు నిర్మిస్తానని అన్నారు. ప్రియదర్శన్‌ దర్శకత్వంలో రెండు నిమిషాల పాత్ర ఉన్నా నటించడానికి తాను సిద్ధం అని నటి పార్వతీనాయర్‌ అన్నారు.
 

మరిన్ని వార్తలు