ఆరేళ్లుగా విశాల్‌ డబ్బులు కాజేసిన మహిళ!

5 Jul, 2020 15:26 IST|Sakshi

చెన్నై : ప్రముఖ హీరో విశాల్‌ను ఓ మహిళ మోసం చేశారు. ఆయన వద్ద పనిచేస్తూనే పెద్ద మొత్తంలో డబ్బులు కాజేశారు. వివరాల్లోకి వెళితే.. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా విశాల్‌ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌లో ఆయన పలు చిత్రాలను నిర్మించారు. అయితే ఆ ప్రొడక్షన్‌ కంపెనీలో పనిచేసే ఓ మహిళ ఆరేళ్ల కాలంలో దాదాపు 45 లక్షలు దారి మళ్లించినట్టుగా సమాచారం. ఈ మేరకు విశాల్‌ మేనేజర్‌ ఇటీవలే చెన్నైలోని విరుగంబక్కం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. నిందితురాలు ఆదాయపు శాఖకు చెల్లించాల్సిన డబ్బులను తన వ్యక్తిగత బ్యాంక్‌ అకౌంట్‌లోకి బదిలీ చేసినట్టుగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. (చదవండి : ‘విశాల్‌ చక్ర’ ట్రైలర్‌ మామూలుగా లేదుగా!)

సినిమాల విషయానికి వస్తే.. విశాల్‌ ప్రస్తుతం హీరోగా నటిస్తూ చక్ర, తుప్పరివాలన్‌ 2 చిత్రాలను నిర్మిస్తున్నారు. అందులో ఇటీవలే విడుదలైన చక్ర ట్రైలర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. ఎంఎస్ ఆ‌నందన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రముఖ నటి రెజీనా ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

మరిన్ని వార్తలు