‘కేరింత’, ‘మనమంతా’, ‘జెర్సీ’ సినిమాల్లో ఫీల్ గుడ్ పాత్రలు చేశారు నటుడు విశ్వంత్. ప్రసుత్తం ఆయన హీరోగా నటించిన చిత్రం ‘తోలుబొమ్మలాట’. విశ్వనాథ్ మాగంటి దర్శకత్వం వహించారు. దుర్గా క్రియేషన్స్ పతాకంపై దుర్గాప్రసాద్ మాగంటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా విశ్వంత్ విలేకరులతో మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో నాతోపాటు రాజేంద్రప్రసాద్గారు, ‘వెన్నెల’ కిషోర్, హర్షిత కీలక పాత్రల్లో తోలుబొమ్మలాటలు ఆడారు. ఇందులో నాది ఒక పాత్ర మాత్రమే, హీరోగా కనిపించను. ఇలాంటి కథలో హీరోగా కనిపిస్తే సినిమా ఫెయిల్ అయినట్లే.
ఫ్యామిలీ డ్రామాలో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. ఎవరూ చూపించని ఒక యూనిక్ పాయింట్ను ఈ సినిమాలో చూపించబోతున్నాం. కొన్ని రోజులు జరిగే ఈ ప్రయాణంలో మనుషులు ఏ విధంగా మారిపోతారు? అనే కాన్సెప్ట్తో చిన్న చిన్న పాయింట్స్ని హైలెట్ చేస్తూ చూపిస్తున్నాం. ‘గొప్పదిరా మనిషి పుట్టుక..’ అనే పాటలోనే మా సినిమాలోని భావాన్ని చెప్పాం. ఎప్పటికైనా అందరూ వెళ్లిపోవాల్సిందే. మధ్యలో జరిగే నాటకమే జీవితం అనే లైన్లో సినిమా ఉంటుంది. 13 నిమిషాల క్లైమాక్స్ సీన్ సినిమాకు ప్లస్. సురేశ్ బొబ్బిలి మంచి సంగీతం అందించారు. ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నాను’’ అన్నారు.