క్రేజీ ప్రాజెక్ట్‌లో ఐశ్వర్య..?!

15 Mar, 2019 12:37 IST|Sakshi

నటి ఐశ్వర్య రాజేశ్‌కు భారీ అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఇటీవల సెక్క సివంద వానం, కనా వంటి చిత్రాల సక్సెస్‌ ఈమె కెరీర్‌కు బాగా ఉపయోగపడ్డాయి. అంతే కాదు కాక్కాముట్టై చిత్రంతోనే నటిగా తానేమిటో నిరూపించుకున్న ఐశ్వర్యరాజేశ్‌ పదహారణాల తెలుగమ్మాయి అని తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో కామ్రేడ్‌ అనే చిత్రంలో విజయ్‌దేవరకొండకు జంటగా నటించింది. ఈ చిత్రం త్వరలో విడుదల కావడానికి ముస్తాబవుతోంది. ఇదేకాక మరో రెండు తెలుగు చిత్రాలు, తమిళంలో ఇదు వేదాళం సొల్లుం కథై, కర్పూరనగరం, దర్శకుడు మణిరత్నం నిర్మాణంలో విక్రమ్‌ప్రభుకు జంటగా నటించే చిత్రంతో కలిపి ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాలు ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి.

తాజాగా కోలీవుడ్‌లోనూ స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలు తలుపుతడుతున్నాయి. ధనుష్‌కు జంటగా వడచెన్నై–2లో నటించనున్న ఐశ్వర్యరాజేశ్‌కు తాజాగా నటుడు శివకార్తికేయన్‌తో జతకట్టే అవకాశం దక్కినట్లు తెలిసింది. ప్రస్తుతం మిస్టర్‌ లోకల్‌ చిత్రాన్ని పూర్తి చేసి రవికుమార్‌ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్న శివ కార్తికేయన్‌ తాజాగా హీరో అనే చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం ఇటీవలే ప్రారంభోత్సవ కార్యక్రమాలను జరుపుకుంది. ఈ స్టార్‌ నటుడు మరో చిత్రానికి పచ్చజెండా ఊపేశారు. సుశీంద్రన్‌ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనుంది. ఇందులో శివ కార్తికేయన్‌కు జంటగా ఐశ్వర్య రాజేశ్‌ను నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే శివ కార్తికేయన్‌ నిర్మించిన కనా చిత్రంలో నటించి పేరు తెచ్చుకున్న ఐశ్వర్యరాజేశ్‌ ఇప్పుడు ఏకంగా ఆయన పక్కనే హీరోయిన్‌గా కనిపించనుంది.
 

మరిన్ని వార్తలు