మళ్లీ దక్షిణాదివైపే చూపు

27 Feb, 2018 02:02 IST|Sakshi
ఇలియానా

తమిళసినిమా: నటి ఇలియానా కన్ను మళ్లీ దక్షిణాదిపై పడింది. తొలి చిత్రం దేవదాస్‌ ఈ అమ్మడికి టాలీవుడ్‌లో అనూహ్య సక్సెస్‌ను అందించింది. అదే విధంగా పోకిరి చిత్రం స్టార్‌ ఇమేజ్‌ను తెచ్చి పెట్టింది. అంతే క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే కోలీవుడ్‌లో కేడీ చిత్రం ఇలియానాను నిరాశపరచడంతో ఇక్కడ ఆమెను మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. ఆ తరువాత టాలీవుడ్‌ క్రేజ్‌ కోలీవుడ్‌లో విజయ్‌కు జంటగా నన్బన్‌ చిత్రంలో నటించే అవకాశాన్ని తెచ్చి పెట్టింది. అలా పాపులర్‌ అయిన ఇలియానాకు బాలీవుడ్‌పై మోహం పుట్టింది. అంతే దక్షిణాదిని దూరం చేసుకుంది. అయితే బాలీవుడ్‌లో ఒకటీ అరా చిత్రాలు ఇలియానాకు చెప్పుకోదగ్గ చిత్రాలుగా నిలిచాయి. అక్కడిప్పుడు అవకాశాలు పెద్దగా రావడం లేదు, సక్సెస్‌లు లేవు. దీంతో తరచూ వివాదాలతో వార్తల్లో ఉండేలా తాపత్రయ పడుతోంది. ఆ మధ్య దక్షిణాది చిత్రాల్లో నా నడుమును చూపడానికే ఎక్కువ ఆసక్తి చూపేవారని, అక్కడ నటిస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని మీడియాకు ఇంటర్వ్యూ లు ఇచ్చి కలకలం రేపింది.

అదేవిధంగా ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూస్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ వార్తల్లోకెక్కింది. ఇటీవల బాయ్‌ఫ్రెండ్‌ను రహస్యంగా పెళ్లి చేసేసుకుందనే ప్రచారం వైరల్‌ అవుతోంది. ఈ విషయం గురించి బాలీవుడ్‌ మీడియా ప్రశ్నించగా స్పష్టమైన సమాధానమివ్వకుండా ఎస్కేప్‌ అయ్యింది. ఇక హిందీలో నటిస్తున్న తాను మళ్లీ తెలుగు, తమిళ భాషల్లో నటించాలని ఆశ పడుతున్నానని, అయితే గ్లామరస్‌ పాత్రలను కాకుండా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నట్లు, అలాంటి పాత్రల కోసం ఎదురు చూస్తున్నానని ఇలియానా పేర్కొంది. మరి పిల్లి మెడకు ఎవరు గంట కడతారో చూడాలి. 

మరిన్ని వార్తలు