నాలో కొత్త అందాలు చూస్తారు

3 Sep, 2016 02:14 IST|Sakshi
నాలో కొత్త అందాలు చూస్తారు

చిత్ర విచిత్రమైన రంగం సినిమా అంటారు. ఇది ఎప్పడు ఎవరిని పెకైత్తుతుందో, ఎవరిని కిందపడేస్తుందో తెలియదు. తారల ప్రవర్తనా అందుకు తగ్గట్టుగానే ఉంటుంది. నటి లక్ష్మీమీనన్ విషయానికొస్తే కుంకీ చిత్రం కోలీవుడ్‌లో తన భవిష్యత్‌కు పునాదులు వేస్తుందని తనే ఊహించి ఉండరు. ఆ చిత్రంలో కొంచెం బొద్దుగా ఉన్నా లక్ష్మీమీనన్‌ను తమిళ ప్రేక్షకులు ఆదరించారు. దీంతో వరుసగా అవకాశాలు తలుపు తట్టాయి. అలాంటి సమయంలో కాస్త లావుగా ఉన్నావు బరువు తగ్గమ్మా అన్న సన్నిహితుల హితవును ఖాతరు చేయలేదు.
 
  పైగా నేనింతే, సన్నబడడానికి కసరత్తులు చేయను, నోరు కట్టుకోను, నచ్చింది లాగించేస్తాను అని స్టేట్‌మెంట్స్ కూడా ఇచ్చేశారు. అందుకే ఏదైనా అనుభవిస్తేనే తెలుస్తుందంటారు. లక్ష్మీమీనన్‌కు పెద్దగా ఫ్లాప్‌లు లేవు. అయినా అంతగా అవకాశాలూ లేవు. ఈ పరిస్థితికి స్వయంకృతాపరాధమే కారణం కావచ్చు. ఆ మధ్య మంచి ప్రైమ్ టైమ్‌లో ఉండగా చదువు ముఖ్యం అంటూ నటనకు గ్యాప్ తీసుకున్నారు. ఆ తరువాత వేదాళం చిత్రంలో చెల్లెలిగా నటించారు. ఆ చిత్రం హిట్ అయినా లక్ష్మీమీనన్  దాన్ని  ప్లస్సో, మైనస్సో అని బేరీజు వేసుకునే లోపలే అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.
 
  ఆ తరువాత అడపాదడపా అవకాశాలు రావడంతో లక్ష్మీమీనన్ పునరాలోచనలో పడ్డారని సమాచారం. ఆ మధ్య జయంరవితో మిరుదన్ చిత్రంలో నటించిన ఈ భామ ప్రస్తుతం విజయసేతుపతికి జంటగా రెక్క చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి కావొచ్చింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో జీవాతో నటించనున్న చిత్రం మినహా మరేమీ లేవు. దీంతో గత వైభవాన్ని చేజిక్కించుకోవడానికి దారులు వెతికుతున్న లక్ష్మీమీనన్ అందుకు అందాలు పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చారట.
 
 గ్లామర్ విషయంలోనూ తన పంథా మార్చుకోవాలని భావించిన ఈ కేరళకుట్టి తాజాగా స్లిమ్‌గా తయారవడానికి తన మాతృగడ్డపై ప్రాచుర్యం పొందిన ఆయుర్వేద చికిత్సను ఎంచుకున్నారట. 20 ఏళ్ల పరువంలోకి ఎంటరైన లక్ష్మీమీనన్ ఇకపై తనలో కొత్త అందాలను చూస్తారంటున్నారు.