మీటూ ఆరోపణలపై నమ్మకం లేదు : హీరోయిన్‌

20 Jan, 2019 10:18 IST|Sakshi

అచ్చం ఎంబదు మడమయడా చిత్రంతో కోలీవుడ్, టాలీవుడ్‌ (తెలుగులో సాహసమే శ్వాసగా)లో  ఒకే సారి పరిచయమైంది మంజిమా . ఈ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని సాధించినా మంజిమామోహన్‌ కెరీర్‌ మాత్రం వేగం పుంజుకోలేదనే చెప్పాలి. హిందీ చిత్రం క్వీన్‌ మలయాళ రీమేక్‌లో కంగనారావత్‌ పాత్రలో నటించింది. జామ్‌జామ్‌ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఈ చిత్ర విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

జామ్‌ జామ్‌ పాటు మరో మలయాళ చిత్రంలోనూ నటిస్తోంది. ఇక తమిళంలో ప్రస్తుతం ఈ బ్యూటీ గౌతమ్‌కార్తీక్‌తో జత కట్టిన దేవాట్టం చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. తాజాగా జీవా, అరుళ్‌నిధి కలిసి నటిస్తున్న చిత్రంలో నాయకిగా నటించబోతోంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న మీటూ గురించి ప్రస్తావన తీసుకురాగా, మీటూ కారణంగా చిత్ర పరిశ్రమలో ఏదో మార్పు వచ్చిందని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు మంజిమామోహన్‌ బదులిస్తూ దాని గురించి తనకు తెలియదంది. 

అలాంటి అనుభవం తనకు ఎదురు కాలేదని పేర్కొంది. మీటూ వ్యవహారంలో కొందరి అనుభవాలు నమ్మదగ్గవిగానూ, మరి కొందరి ఆరోపణలు నమ్మశక్యంగానివిగానూ ఉన్నాయని చెప్పింది. చెప్పాలంటే మీటూ ఆరోపణలపై నమ్మకం లేదని పేర్కొంది. తాను షూటింగ్‌కు వచ్చానా, పేకప్‌ అయ్యిందా, ఇంటికి వెళ్లానా అన్నట్టుగా తన దిన చర్య ఉంటుందని మంజిమామోహన్‌ అంది. అయినా ఎదిగే దశలో ఉన్న ఈ అమ్మడు ఇంత కంటే ఏం చెబుతుంది.

మరిన్ని వార్తలు