నా కూతుర్ని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు

1 Aug, 2019 07:00 IST|Sakshi

తమిళనాడు ,పెరంబూరు: నా కూతుర్ని ప్రేమ పేరుతో టార్చర్‌ చేస్తున్నాడని సినీ నటి తల్లి నటుడిపై ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్లితే.. దర్శకుడు బాలా శిష్యుడు నందన్‌ సుబ్బరాయన్‌ తొలిసారిగా తెరకెక్కించిన చిత్రం మయూరన్‌. ఇందులో అముదవానన్‌ హీరోగానూ, మిస్‌ ఇండియా (ఫెమీనా) కిరీటాన్ని గెలుచుకున్న అశ్మిత హీరోయిన్‌గానూ నటించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. అయితే ఈ చిత్ర ప్రమోషన్‌కు హీరోహీరోయిన్లు ఇద్దరూ హాజరు కాలేదు. హీరో వస్తే తన కూతురు రాదని ఆమె తల్లి  నిర్మాతలకు చెప్పింది. కారణం కోటీశ్వరురాలైన తన కూతురిని చిత్ర కథానాయకుడు అముదవానన్‌ ప్రేమ పేరుతో టార్చర్‌ చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది.

కాగా చిత్ర ప్రమోషన్‌కు హీరోయిన్‌ రాకపోతే తానెందుకు రావాలని హీరో మొండికేస్తున్నాడని చిత్ర దర్శక నిర్మాతలు ఆరోపణలు చేస్తున్నారు. నటి జ్యోతిక నటించిన జాక్‌పాట్, కృష్ణ హీరోగా నటించిన కళుగు 2 వంటి పెద్ద చిత్రాల మధ్య తమ చిత్రం విడుదల కాబోతోందని, ఇలాంటి సమయంలో చిత్రానికి ప్రచారం లేకపోవడం బాధగా ఉందని చిత్ర దర్శక నిర్మాతలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నడిగర్‌సంఘం ఎన్నికలు జరిగినా ఫలితాలు తేలకపోవడంతో సంఘానికి ఫిర్యాదు చేసే అవకాశం కూడా లేదని వాపోతున్నారు.

మరిన్ని వార్తలు