కోలివుడ్‌కు హైదరాబాదీ భామ

10 Feb, 2017 01:47 IST|Sakshi
కోలివుడ్‌కు హైదరాబాదీ భామ

ఆరణాల అచ్చ తెలుగు అమ్మాయిలు చాలా మంది కోలీవుడ్‌కు దిగుమతి అయ్యారు. అయితే వారెవరూ పొందనటువంటి సూపర్‌ అవకాశాన్ని నటి రీతూవర్మ అందుకున్నారు. అయితే ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే టాలీవుడ్‌లో ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. అనుకోకుండా అనే లఘు చిత్రానికిగానూ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. ఆ తరువాత రీతూవర్మ నటించిన పెళ్లిచూపులు చిత్రం చిన్న చిత్రంగా తెరకెక్కి సంచలన విజయాన్ని కైవసం చేసుకుంది. దీంతో రీతూకు బహుళ పాచ్యుర్యం లభించింది. అంతే కాదు ఆ చిత్ర రీమేక్‌ హక్కులను ప్రముఖ కోలీవుడ్‌ దర్శకుడు గౌతమ్‌మీనన్‌ సొంతం చేసుకున్నారు. ఇందులోనూ నాయకిగా రీతూవర్మనే నటింపజేయాలనుకున్నారాయన. అయితే అనూహ్యంగా ఆ అవకాశాన్ని మిల్కీబ్యూటీ తమన్నా తన్నుకు పోయారు.

అయితేనేం రీతూకు గౌతమ్‌మీనన్‌ మరో సూపర్‌ ఆఫర్‌ను అందించారు. చియాన్‌ విక్రమ్‌ హీరోగా ఆయన దర్శకత్వం వహిస్తున్న యాక్షన్‌ థ్రిల్ల ర్‌ కథా చిత్రం ధ్రువనక్షత్రంలో హీరోయిన్‌ అవకాశం రీతూవర్మను వరించింది. నిజానికి ఇందులో నటి అను ఎమ్మాన్యుయేల్‌ ఎంపికయ్యారు. తను విక్రమ్‌తో కలిసి ఫొటో షూట్‌లో కూడా పాల్గొన్నారు. అలాంటిది ఇప్పుడు తను ధ్రువనక్షత్రం చిత్రం నుంచి వైదొలిగినట్లు, ఆ పాత్రలో నటి రీతూవర్మ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత ఎస్కేప్‌ ఆర్టిస్ట్‌ అధినేత పి.మదన్‌ స్పష్టం చేశారు. మొత్తం మీద నటి రీతూవర్మ కోలీవుడ్‌లో చాలా బలంగా కాలు పెడుతున్నారన్న మాట. అయితే ఈ అమ్మడు ఇప్పటికే చిన అనే తమిళ చిత్రంలో యువ నటుడు కళైయరసన్‌కు జంటగా నటిస్తున్నారన్నది గమనార్హం.