మనసును గాయపరుస్తున్నారు అంటూ ఆవేదనను వ్యక్తం చేస్తోంది నటి స్వాతి. ఈ తెలుగమ్మాయి కోలీవుడ్లోనూ సుబ్రమణిపురం, వడకర్రి వంటి సక్సెస్పుల్ చిత్రాలతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఇక మాతృభాషలోనూ మొదట కలర్స్స్వాతిగా పేరు తెచ్చుకుని ఆ తరువాత కథానాయకిగా మంచి గుర్తింపునే తెచ్చుకున్న స్వాతికి నటిగా తగినంత స్టార్డమ్ రాలేదు. పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకున్న స్వాతి ఆ చట్రం బయట పడదామా? లేక అదే ముద్రతో ముందుకు సాగుదామా? అన్న ఆలోచనలతో సతమతం అవుతున్న తరుణంలో వదంతులు మరో పక్క వేదనకు గురిచేస్తున్నాయని కంటతడిపెడుతోంది.
తనపై వస్తున్న రూమర్లపై స్పందించిన స్వాతి.. తమిళ నటులు జై, కృష్ణ వంటి యువ హీరోలతో సంబంధాలు అంటగడుతూ అసత్య ప్రచారం చేస్తున్నారనే బాధను వ్యక్తం చేసింది. టాలీవుడ్ లో కూడా ఇలాంటి వదంతులకు కొదవ లేదని చెప్పింది. హీరోయిన్లు మనలాంటి మనుషులేననీ, వారికి మనసు ఉంటుందనీ, అది అవాస్తవ ప్రచారాలతో గాయపడుతుందని ప్రజలు గుర్తించాలని అంది. సినీరంగంలో ఇలాంటి వదంతులు సాధారణం అని తాను సరిపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నా, కుటుంబ సభ్యులు, మిత్రులు ఆవేదన చెందుతున్నారని స్వాతి పేర్కొంది. దయ చేసి ఇలాంటి నిరాధార వార్తలను ప్రచారం చేయరాదని కోరింది.