వాల్మీకి సెట్‌లో ఆస్కార్‌ విన్నర్‌!

6 Aug, 2019 09:29 IST|Sakshi

దర్శకుడు హరీష్‌ శంకర్‌ ప్రస్తుతం వరుణ్ తేజ్‌ ప్రధాన పాత్రలో వాల్మీకి సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సినిమా జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీ సెట్‌లో ఓ లెజెండరీ సినిమాటోగ్రాఫర్ సందడి చేశారు. జేఎఫ్‌కే, ద ఏవియేటర్‌, హూగో లాంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌ గా ఆస్కార్‌ అవార్డు అందుకున్న రాబర్ట్ రిచర్డ్సన్‌ వాల్మీకి సెట్‌కు విచ్చేశారు.

ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ తన సోషల్ మీడియా పేజ్‌ లో షేర్‌ చేశారు. ‘సినిమాటోగ్రాఫర్లు దేవుడిగా భావించే రాబర్ట్ రిచర్డ్సన్‌ వాల్మీకి సెట్‌కు విచ్చేశారు. మూడు సార్లు ఆస్కార్‌ సాధించిన వ్యక్తి నా కోసం కెమెరా ఆపరేట్ చేస్తుంటే.. నేను యాక్షన్‌ చెప్పాను’ అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు ఈ సంఘటనను తన చివరి రోజు వరకు గుర్తు పెట్టుకుంటానంటూ ట్వీట్ చేశారు హరీష్‌.

వరుణ్‌ తేజ్‌ నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు అధర్వ మురళీ మరో హీరోగా నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్‌ సంగీతమందిస్తున్నారు. 14 రీల్స్‌ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపి ఆచంటలు నిర్మిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు