ఆ బాలీవుడ్‌ దర్శకుడు ఇక లేరు

18 Sep, 2019 14:30 IST|Sakshi
శ్యామ్‌ రామ్‌సే దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు

సాక్షి, ముంబై :  బాలీవుడ్ దర్శకుడు శ్యామ్ రామ్‌సే(67) బుధవారం ముంబైలో మరణించారు. గత కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతూ ఈ ఉదయం కన్నుమూసారని ఆయన మేనల్లుడు అమిత్ రామ్సే బాలీవుడ్ మీడియాకు వెల్లడించారు. శ్యామ్ రామ్సే అంత్యక్రియలు ఈ రోజు విల్లే పార్లే శ్మశానవాటికలో జరుగనున్నాయని తెలిపారు. హారర్‌ సినిమాలు అనగానే బాలీవుడ్‌లో మొదట గుర్తుకు వచ్చేది రామ్‌సే ఏడుగురు సోదరులే. తులసీ రామ్‌సే, కుమార్‌ రామ్‌సే, శ్యామ్‌ రామసే, కేశు రామ్‌సే, గంగు రామ్‌సే, కిరణ్‌ రామ్‌సే సోదరులు 1980-90 మధ్య కాలంలో లోబడ్జెట్ హారర్‌ చిత్రాలు తీసి ఓ ట్రెండ్‌ క్రియేట్‌ చేశారు.  ప్రధానంగా శ్యామ్ తన సోదరుడు తులసితో కలిసి 1993 నుండి 2001 వరకు ప్రసారమైన ది జీ హర్రర్ షో అనే భారతీయ టెలివిజన్‌లో మొదటి భయానక ధారావాహికకు దర్శకత్వం వహించారు. అలాగే స్టార్ ప్లస్, ఇతర ప్రైవేట్ ఛానెళ్లలో హారర్ డ్రామా షోలకు కూడా దర్శకత్వం వహించారు. ఇవి అటుప్రేక్షకుల నుంచి  అద్భుతమైన స్పందన రావడంతో  బుల్లితెరపై భారీ విజయాన్ని సాధించాయి.  శ్యామ్‌ మృతిపై పలువురు బాలీవుడ్‌  సినీ ప్రముఖులు, ఇతరులు  సోషల్‌ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలిపారు.

కాగా పురానా మందిర్, వీరానా, దో గాజ్ జమీన్ కే నీచే, బ్యాండ్ దర్వాజా, పురానీ హవేలి, అంధేరా, డాక్‌ బంగ్లా,  సబూత్, ఖేల్ మొహబ్బత్ కా, గెస్ట్ హౌస్ వంటి చిత్రాలు  రామ్‌సే సోదరుల ప్రత్యేక ప్రతిభకు నిదర్శనం. వారు నిర్మించిన చివరి చిత్రం 2017లో వచ్చిన కోయి హై. దాదాపు ఏడు సంవత్సరాల పాటు ప్రసారమైన జీ హారర్‌ షోకు శ్యామ్, అతడి సోదరుడు తులసి రామ్‌సే  దర్శకత్వం వహించారు. తులసి గత ఏడాది  డిసెంబర్లో మరణించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు