అజిత్‌కు జంటగా తలైవా ప్రేయసి

23 Jan, 2020 09:19 IST|Sakshi
హూమా ఖురేషి ,

సినిమా: తలైవా ప్రేయసితో ‘తల’కు జత కుదిరింది. తల అజిత్‌ వరుస విజయాలతో జోరు మీదున్న విషయం తెలిసిందే. విశ్వాసం, నేర్కొండ పార్వై వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాల తరువాత అజిత్‌ తాజాగా నటిస్తున్న చిత్రం వలిమై. నేర్కొండ పార్వై చిత్ర దర్శకుడు హెచ్‌.వినోద్‌నే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఆ చిత్ర దర్శకుడు బోనీకపూర్‌నే ఈ వలిమై చిత్రాన్ని జీ.స్టూడియోస్‌తో కలసి నిర్మిస్తున్నారు. ఇందులో అజిత్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా నటిస్తున్నారు. ఇది అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రంగా ఉంటుందని యూనిట్‌ వర్గాలు ఇప్పుటికే తెలిపారు. కాగా చిత్రం ప్రారంభమై చాలా రోజులే అయ్యింది. హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న వలిమై చిత్రం ప్రస్తుతం చెన్నైలో చిత్రీకరణను జరుపుకుంటోంది. అయితే ఇప్పటి వరకూ ఇందులో అజిత్‌కు జంటగా నటించే నాయకి ఎవరన్నది చిత్ర వర్గాలు వెల్లడించలేదు. అయితే ఆ మధ్య న్యూయార్క్‌లో నటి నయనతారను బోనీకపూర్‌ కలవడంతో వలిమైలో ఆమె నటించనుందనే ప్రచారం జరిగింది.

అయితే అది వదంతి అని తెలిసింది. ఆ తరువాత బాలీవుడ్‌ బ్యూటీ యామిని గౌతమ్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరో నటి పేరు వినిపిస్తోంది. ఆమెనే నటి హ్యూమా ఖురోషి. ఈ అమ్మడు తమిళంలో రజనీకాంత్‌ నటించిన కాలా చిత్రంలో ఆయనకు మాజీ ప్రేయసిగా నటించిందన్నది గమనార్హం. ఆ తరువాత కొలీవుడ్‌లో కనిపించిన హూమా ఖురోషి పేరు ఇప్పుడు మళ్లీ వినిపిస్తోంది. వలిమై చిత్రంలో అజిత్‌కు జంటగా నటించనుందనేది తాజా ప్రచారం. అయితే ఆమె వలిమై చిత్రంలో నటించడం ఖాయం అయ్యిందని, అంతే కాదు ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొంటోందని తెలిసింది.

ఇక్కడ ఈ అమ్మడి సెకెండ్‌ చిత్రం వలిమై అవుతుంది. కాగా నటుడు రజనీకాంత్‌ బాణీలోనే అజిత్‌ కూడా యువ హీరోయిన్లతో జత కట్టడానికి ఇష్టపడడం లేదు. అంతే కాదు తన చిత్రాల్లో కథా పాత్రలను తన వయసుకు తగ్గట్టుగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. కాగా వలిమై చిత్రంలో నటి హూమా ఖురేషి పాత్ర ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంగీతాన్ని యువన్‌ శంకర్‌రాజా, ఛాయాగ్రహణం నీరవ్‌షాఅందిస్తున్నారు. వలిమై చిత్రాన్ని దీపావళి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు