‘ఆ సినిమా పోస్టర్‌ను సరిగ్గా చూడండి’

30 Jul, 2019 11:36 IST|Sakshi

జడ్జిమెంటల్‌ హై క్యా సినిమా పోస్టర్‌పై వివాదం

బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌, రాజ్‌కుమార్‌ల్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన జడ్జిమెంటల్‌ హై క్యా పోస్టర్‌పై వివాదం చెలరేగింది. తన అనుమతి లేకుండానే తన ఆర్ట్‌ను ఉపయోగించుకున్నారంటూ హంగేరీకి చెందిన ఓ మహిళా ఫొటోగ్రాఫర్‌ ఆ మూవీ టీంపై విమర్శలు గుప్పించారు.ఎవరి జీవితాన్ని వాళ్లు సెలబ్రేట్‌ చేసుకోవాలి అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా పోస్టర్లను కాస్త భిన్నంగా డిజైన్‌ చేశారు. ఇందులో హీరోహీరోయిన్ల ఫొటోలతో కూడుకున్న ఓ పోస్టర్‌లో  కంగనా, రాజ్‌కుమార్‌ల ఒక కన్ను స్థానంలో పిల్లి, ఎలుకలు దర్శనమిచ్చాయి.

ఈ క్రమంలో ఈ పోస్టర్‌పై స్పందించిన హంగేరియన్‌ ఫొటోగ్రాఫర్‌ ఫ్లోరా బోర్సీ కంగనా, తన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ....‘ ఏమైనా పోలికలు ఉన్నాయా? ఇదొక ప్రఖ్యాత బాలీవుడ్‌ సినిమా జడ్జిమెంటల్‌ హై క్యా పోస్టర్. వాళ్లు కనీసం నా అనుమతి కోరలేదు. అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా నా లాంటి ఫ్రీలాన్స్‌ ఆర్టిస్టుల స్మజనాత్మకతను దొంగిలించడం సిగ్గుచేటు’ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆమెకు అండగా నిలిచారు.

ఈ చిత్ర నిర్మా‌త ఏక్తాకపూర్‌, కంగనా టీమ్‌పై మండిపడుతున్నారు. ‘ పర్మిషన్‌ లేకుండా ఒకరి క్రియేటివిటీని దొంగిలించి మీరు బాగానే సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకు ఏమాత్రం సిగ్గు అనిపించడం లేదా’ అంటూ పరుష పదజాలంతో విరుచుకుపడుతున్నారు. ‘సినిమా మొత్తం కాపీనే అయి ఉంటుంది.. మా బాలీవుడ్‌ వాళ్లకు ఇదొక అలవాటు అయిపోయింది. మేము సిగ్గుపడుతున్నాం మేడం’ అంటూ భారత అభిమానులు బోర్సీకి మద్దతు పలుకుతున్నారు. ఈ క్రమంలో ఎవరో ఒకరు చేసిన పనికి మొత్తం ఇండస్ట్రీని, జన్మభూమిని కించపరిచే విధంగా మాట్లాడటం వల్ల ఉపయోగం ఉండదు అంటూ ఆమె హితవు పలికారు. ఇక ఈ విషయంపై జడ్జిమెంటల్‌ హై క్యా టీం ఏవిధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. కాగా కంగనా రనౌత్, రాజ్‌కుమార్‌ రావ్‌ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రకాశ్‌ కోవెలముడి దర్శకత్వం వహించాడు. జూలై 26న రిలీజ్‌ అయిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక‌్షన్లు రాబడుతోంది.

మరిన్ని వార్తలు