ఇది నిజంగా న్యాయమేనా?

6 Dec, 2019 21:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దిశ హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ వార్త వినగానే చాలా సంతోషంగా ఫీలయ్యానని నటి మంచు లక్ష్మి అన్నారు. తప్పు చేసిన వారికి వెంటనే శిక్ష పడినందుకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగిందని వ్యాఖ్యానించారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ.. పోలీసులు ఎన్‌కౌంటర్‌పై వంద శాతం సంతృప్తిగా ఉన్నట్టు వెల్లడించారు. దోషులకు ఎంత త్వరగా శిక్ష పడాలని ఎలా కోరుకుంటానో, చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడని అలాగే కోరుకుంటానని చెప్పారు. అయితే ఎన్‌కౌంటర్‌ తర్వాత సెలబ్రేషన్స్‌ చూసి తనకు భయం వేసిందన్నారు. ఇది సెలబ్రేట్‌ చేసుకునే అంశం కాదని, ఈ ఎన్‌కౌంటర్‌ను చూసి ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారేమోనన్న భయాన్ని ఆమె వ్యక్తపరిచారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఇచ్చిన తీర్పులను వెంటనే అమలు చేసి న్యాయం జరుగుతుందన్న భరోసా కల్పించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.

ఆమె ఇంకా ఏమన్నారంటే..?
‘తప్పు చేసిన వారిని వెంటనే శిక్ష పడినందుకు సంతోషం. కానీ ఇది నిజంగా న్యాయమేనా? ప్రతిసారి దోషులను ఎన్‌కౌంటర్‌ చేసి చంపేయలేరు. చంపేయాలని అందరూ కోరుకుంటారు. ఎంతమందిని ఎన్‌కౌంటర్‌ చేసుకుంటూ వెళతారు? చనిపోయిన నలుగురు నిందితుల తల్లిదండ్రులు ఎంత కుమిలిపోయి ఉంటారు? వాళ్లను చూస్తుంటే నిరాక్షరాస్యుల్లా ఉన్నారు. ఎన్నో కష్టాలు పడి వాళ్లు తమ పిల్లలను ఇప్పటివరకు పెంచుకుంది ఇలా దారుణంగా చనిపోవడానికా? ఇది ఎందుకు జరుగుతోంది? నిర్భయ కేసులో దోషులకు శిక్ష పడి ఏడేళ్లు గడిచినా ఇప్పటివరకు అమలు చేయలేదు. ఇదే న్యాయం? మేము కట్టిన పన్నులతో ఏడేళ్లుగా నిర్భయ దోషులను జైళ్లో మేపుతున్నారు. దీన్ని మేము ప్రశ్నించాలనుకుంటున్నాం. ఆడపిల్ల గడప దాటి బయటకు వెళుతుంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి. దిశ చివరిసారిగా తన చెల్లితో ఫోన్‌లో మాట్లాడిన మాటలు విటుంటే మనసు తరుక్కుపోతోంది. 5 ఏళ్ల పసిపాప నుంచి 60 ఏళ్ల వృద్ధురాళ్లపై అఘాత్యాలు జరగడానికి కారణం ఏంటి? ముందు మనలో మార్పు రావాలి. ఇవాల్టీ ఘటనతో మన దేశంలో కూడా వెంటనే న్యాయం జరుగుతుందన్న నమ్మకం వచ్చింద’ని మంచు లక్ష్మి అన్నారు.

సంబంధిత వార్తలు..

'నేను ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకం'

నన్ను కూడా కాల్చి చంపండి

దిశ కేసు: నేరం చేశాక తప్పించుకోలేరు

ఎన్‌కౌంటర్‌: గుడిగండ్లలో ఉద్రిక్తత

మరిన్ని వార్తలు