నేను పక్కా లోకల్‌!

25 Dec, 2016 23:23 IST|Sakshi
నేను పక్కా లోకల్‌!

‘‘ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగినా.. నేను తెలుగమ్మాయినే. ఈ సినిమాలో పక్కా లోకల్‌ అమ్మాయిగా నటించా’’ అన్నారు ప్రసన్న. ప్రశాంత్, సన్ని హీరోలుగా.. ప్రసన్న, అక్ఛిత హీరోయిన్లుగా శివశ్రీ దర్శకత్వంలో మళ్ల విజయప్రసాద్‌ నిర్మించిన ‘ఇంకేంటి నువ్వే చెప్పు’ ఈ నెల 31న రిలీజవుతోంది. ప్రసన్న మాట్లాడుతూ – ‘‘మా అమ్మ హైదరాబాదీ, నాన్న ఆస్ట్రేలియన్‌. రెండేళ్లకోసారి హైదరాబాద్‌ వచ్చి వెళ్తుంటాను. నాలుగేళ్లు భరతనాట్యం నేర్చుకున్నా. ఓ తెలుగు అసోసియేషన్‌ ఫంక్షన్‌లో నన్ను చూసిన హీరో ప్రశాంత్‌ ఫ్యామిలీ దర్శక–నిర్మాతలకు నా పేరు సూచించారు. అప్పటికి హీరోయిన్‌ పాత్ర కోసం సుమారు 200 మందిని ఆడిషన్‌ చేశారట!

ఇందులో నేను చేసిన నీలు పాత్ర ‘బొమ్మరిల్లు’లో జెనీలియా తరహాలో ఉంటుంది. అందుకని ఆడిషన్స్‌ టైమ్‌లో నన్ను ‘బొమ్మరిల్లు’లో సీన్‌ చేసి చూపించమన్నారు. ఆ తర్వాతే సెలక్ట్‌ చేశారు. సినిమా షూటింగ్‌ అంతా విశాఖలో చేశారు. తెలుగు డైలాగులు చెప్పడంలో ప్రశాంత్, అతని సిస్టర్‌ నాకు బాగా హెల్ప్‌ చేశారు. మంచి ప్రేమకథా చిత్రమిది. నటిగా నాకు పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నా. నాకు చిన్న ఎన్టీఆర్‌ యాక్టింగ్, డ్యాన్స్‌ అంటే ఇష్టం. ‘నాన్నకు ప్రేమతో’లో డిఫరెంట్‌గా చేశారు. నాగార్జునగారన్నా ఇష్టమే’’ అన్నారు.