మళ్లీ విలన్‌గా చేస్తా..!

23 Apr, 2016 23:14 IST|Sakshi
మళ్లీ విలన్‌గా చేస్తా..!

 ‘‘ఇప్పటివరకూ నేను హీరోగానే చేస్తూ వచ్చాను. బోయపాటి శ్రీను కథ చెప్పగానే కొత్తగా అనిపించింది. అందుకే  విలన్‌గా చేయడానికి ఒప్పుకున్నా’’ అని హీరో ఆది పినిశెట్టి అన్నారు. అల్లు అర్జున్ హీరోగా  బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన ‘సరైనోడు’లో ఆది విలన్‌గా నటించిన విషయం తెలిసిందే.
 
 శనివారం పాత్రికేయులతో ఆది మాట్లాడుతూ - ‘‘ఇందులో వైరం ధనుష్ పాత్రను నేను ఊహించినదాని కన్నా తెర మీద బోయపాటి శ్రీను బాగా తీర్చిదిద్దారు. జస్ట్ ఆయన చెప్పినది ఫాలో అయిపోయానంతే. తమిళనాడులో కూడా ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. నేను చేసిన పాత్ర బన్నీకి కూడా బాగా నచ్చేసింది. అందుకే వేరే భాషలో రీమేక్ చేస్తే తానే హీరోగా చేస్తానని చెప్పాడు.
 
 ఈ సినిమా చూసి, చిరంజీవిగారు, వీవీ వినాయక్‌గారు ఫోన్ చేసి నా లుక్, స్టయిల్‌ను  మెచ్చుకున్నారు.  భవిష్యత్తులో ఇలాంటి పాత్రలు వస్తే విలన్‌గా చేయడానికి వెనకాడను. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో నేను హీరోగా రెండు చిత్రాలు రూపొందనున్నాయి. త్వరలో ఓ ఇంటి వాణ్ణి కాబోతున్నా. అమ్మా, నాన్నలు చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నా’’ అన్నారు.