త్వరలో మళ్లీ వెండితెరపై కనిపిస్తా: లారాదత్తా

29 May, 2014 19:02 IST|Sakshi

ముంబై: మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి లారాదత్తా మళ్లీ సినిమాలపై దృష్టిసారించనుంది. 2010లో టెన్నిస్ క్రీడాకారుడు మహేశ్ భూపతితో వివాహమైన తర్వాత సినిమాలకు దూరమైన ఆమె 2012లో ఓ పాపకు జన్మనిచ్చిన తర్వాత దాదాపుగా నటనకు ఫుల్‌స్టాప్ పెట్టింది. అయితే బాలీవుడ్‌తో అనుబంధాన్ని పూర్తిగా తెంచుకోకుండా నిర్మాతగా కొనసాగింది. అయితే ఇప్పుడు మళ్లీ  మేకప్ వేసుకొని, కెమెరా ముందుకు రావాలని తాపత్రయపడుతోంది. అందుకోసం జోరుగానే ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయమై లారా మాట్లాడుతూ... ‘పెళ్లి తర్వాత బాలీవుడ్‌కు కాస్త దూరమయ్యాను. పాప జన్మించిన తర్వాత నటనకు దాదాపుగా దూరమయ్యాను. నిర్మాతగా కొనసాగినా నటనకు దూరమవడంతో ఏదో కోల్పోయినట్లు అనిపించింది.

 

అందుకే మళ్లీ నటించాలనుకుంటున్నా. అందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నా. కుటుంబసభ్యుల నుంచి కూడా నటించే విషయంలో ఎటువంటి అభ్యంతరం లేదు. అందుకే ఈ ఏడాదే కెమెరా ముందుకు వెళ్లబోతున్నా. అయితే సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేను' అంటూ లారా తెలిపింది.