తెలుగు చిత్రాల్లో నటించను

2 Feb, 2016 08:13 IST|Sakshi
తెలుగు చిత్రాల్లో నటించను

తెలుగు చిత్రాలలో నటించనంటున్నారు సీనియర్ నటి అర్చన. సహజ నటిగా పేరొందిన అతి కొద్దిమంది బహు భాషా నటీమణుల్లో అర్చన ఒకరని పేర్కొనవచ్చు. నిరీక్షణ, ఇల్లు లాంటి చిత్రాలలో అర్చన నటన వర్ణించనలవిగానిది. తనకిచ్చిన పాత్రల్లో అంతగా ఒదిగిపోయే అర్చన చాలా కాలం తరువాత తమిళంలో అళియాద కోలంగళ్ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఇదే పేరుతో ఈమె గతంలో ప్రముఖ దివంగత దర్శకుడు, ఛాయాగ్రహకుడు బాలు మహేంద్ర దర్శకత్వంలో నటించారు.
 
 కాగా ఆయన శిష్యగణం తాజా చిత్రాన్ని రూపొందించడం మరో విశేషం. కాగా బాలు మహేంద్రను గురువుగా భావించే నటి ఈశ్వరీరావు తొలిసారిగా ఈ చిత్ర నిర్మాణంలో భాగం కావడం గమనార్హం. దేవాసిన్హాతో కలిసి చారులత ఫిలింస్ పతాకంపై ఆమె ఈ అళియాద కోలంగళ్ చిత్రాన్ని నిర్మిస్తూ అతిథి పాత్రలో మెరవనున్నారు. కాగా ఈ చిత్రంలో చెప్పుకోవలసిన ముఖ్య అంశాలు నటుడు ప్రకాశ్‌రాజ్, నటి రేవతి ప్రధాన పాత్రలు పోషించడం. నవ దర్శకుడు ఎంఆర్.భారతీ కథ, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఆ చిత్రం గురించి ఆయన తెలుపుతూ బాలు మహేంద్ర శిష్యగణం రూపొందిస్తున్న చిత్రం ఇదన్నారు.
 
 దీన్ని ఆయనకు అంకితం ఇవ్వనున్నట్లు శనివారం మధ్యాహ్నం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు పేర్కొన్నారు. తాను బాలు మహేంద్ర వద్ద పని చేయకపోయినా ఒక పాత్రికేయుడిగా ఆయనతో 20 ఏళ్ల స్నేహంతో ఆయనలానే మంచి కథా చిత్రాలను తెరకె క్కించాలన్న కోరిక ఈ చిత్రం ద్వారా తీరనుండడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రం ద్వారా నిర్మాతగా అవతారమెత్తిన నటి ఈశ్వరీరావు మాట్లాడుతూ బాలు మహేంద్ర జీవించి ఉన్నప్పుడు నా శిష్యులైన మీరంతా కలిసి ఒక చిత్రం చేయండని అంటుండేవారన్నారు. తాను నిర్మాతగా మారడానికి ఆయనే కారణం అని పేర్కొన్నారు.
 
 ఇప్పటికైనా బాలు మహేంద్ర కోరికను ఈ చిత్రం ద్వారా నెరవేర్చుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. కథ నచ్చడం వల్లే ఈ అళియాద కోలంగళ్ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఒక కొరియా చిత్రాన్ని స్పూర్తిగా తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం ఇదని చెప్పారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయనీ మరో 25 రోజుల్లో చిత్ర తొలి కాపీ సిద్ధం అవుతుందనీ ఈశ్వరీరావు తెలిపారు. ఇందులో ప్రధాన పాత్ర ద్వారా చాలా కాలం తరువాత రీఎంట్రీ అవుతున్న నటి అర్చన మాట్లాడుతూ ఒకే కళాశాలలో చదువుకున్న ఇద్దరు స్నేహితులు 24 ఏళ్ల తరువాత కలుసుకున్న నేపథ్యంలో జరిగే సంఘటనలే చిత్ర కథ అని తెలిపారు.
 
  ఆ స్నేహితులుగా తాను, ప్రకాష్‌రాజ్ నటించామని చెప్పారు. నటి రేవతి, నాజర్ ముఖ్యపాత్రలు పోషించారని తెలిపారు. అళియాద కోలంగళ్ టైటిల్ చిత్ర కథకు నప్పే విధంగా ఉండడంతో పాటు బాలు మహేంద్ర చిత్రం పేరు కావడంతో ఆ పేరును నిర్ణయించినట్లు వివరించారు. మంచి పాత్రలయితే ఇకపైనా నటించడానికి సిద్ధం అన్న అర్చనను తెలుగులోనూ నటిస్తారా అన్న ప్రశ్నకు తెలుగు చిత్రాల్లో నటించేది లేదని ఖరాఖండీగా బదులిచ్చారు. కారణం ఏమిటన్న ప్రశ్నకు అక్కడ చేదు అనుభవం చవి చూశానని అర్చన పేర్కొన్నారు.