హైదరాబాద్: రిపోర్టర్లు ఎవరైనా చిత్రపరిశ్రమకు చెందిన వారిని కలిస్తే వారు మొదటగా చెప్పెది.. తమ తదుపరి చిత్రం విశేషాలు, మరికొన్ని కొత్త కబుర్లు చెబుతారు. కానీ టాలీవుడ్ దర్శకుడు పూరిజగన్నాథ్ మాత్రం ముందుగా తనపై వచ్చిన రూమర్లను ప్రస్తావించడం విశేషం. ఓ హీరోయిన్కు, తనకు మధ్య ఎటువంటి సంబంధం లేదంటూ పూరిజగన్నాథ్ తేల్చిచెప్పాడు.
అసలు సంగతేమంటే... ప్రస్తుతం జూ.ఎన్టీఆర్ హీరోగా పూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'టెంపర్'. ఆ సినిమా పనుల్లో బిజీగా ఉన్న తనని కొన్ని విషయాలు డిస్టర్బ్ చేశాయంటారు పూరి. హీరోయిన్ ఛార్మీకి, తనకు మధ్య ఎటువంటి సంబంధం లేదని, తనపై వచ్చిన పుకార్లను పూరి ఖండించారు. తన తదుపరి చిత్రం 'జ్యోతిలక్ష్మి'లో ఛార్మి టైటిల్ రోల్ చేస్తుంది. మూవీ తీస్తున్నామంటే నటీనటులు, దర్శకుడు కలవడం తప్పనిసరి. నా దర్శకత్వంలో నటిస్తున్నందున తన రోల్ మరింత మెరుగ్గా చేయాలన్న తపనతోనే ఛార్మి తనను కలిశారని పూరి చెప్పారు. దీనిపై వేరేలా అర్థం చేసుకోవడం, సంబంధం ఉందంటూ వార్తలు రావడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు.
'జూ.ఎన్టీఆర్, తాను కలిసి 11 ఏళ్ల తర్వాత సినిమా చేస్తున్నాం. ఎన్టీఆర్ మంచి నటుడు. ఇన్నేళ్లు నేనే బిజీగా ఉండటంతో మా కలయికలో సినిమా చేయలేకపోయాం' అని పూరి చెప్పారు. టెంపర్ గురించి పూరిజగన్నాథ్ మాట్లాడుతూ... ఓ నవల ఆధారంగా చేసిన సినిమా అని, ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసేలా ఉంటుందని అన్నారు. హీరోయిన్ కాజల అగర్వాల్తో కూడా తనకు ఇది రెండో సినిమా అని, ఆమె బాలీవుడ్ కెరీర్ గురించి అంతగా ఐడియా లేదన్నారు.
'ఇదివరకే బాలీవుడ్లో ఒక్క సినిమా 'బుడ్డా హోగా తేరా బాప్' చేశాను. బిగ్ బి అమితాబ్కు దర్శకత్వం వహించడం గొప్ప అనుభూతి. ఈ ఏడాది కచ్చితంగా బాలీవుడ్లో రెండో మూవీ చేస్తాను' అని దర్శకుడు పూరిజగన్నాథ్ ముచ్చటించారు.