మా కుటుంబం మొత్తం గర్విస్తున్నాం - మహేష్‌బాబు

31 Oct, 2013 23:23 IST|Sakshi
‘‘తన సినిమాల ఆడియో వేడుకలకు అతిథిగా రావడం తప్ప సుధీర్‌కి నేను చేసింది ఏమీ లేదు. తను స్వశక్తితో పైకొచ్చాడు. మా కుటుంబం మొత్తం అతడిని చూసి గర్విస్తున్నాం’’ అని మహేష్‌బాబు అన్నారు. సుధీర్‌బాబు కథానాయకునిగా కృష్ణారెడ్డి గంగదాసు దర్శకత్వంలో సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఆడు మగాడ్రా బుజ్జి’. అస్మితాసూద్ కథానాయిక. శ్రీ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో మహేష్‌బాబు చేతుల మీదుగా విడుదల చేశారు. ‘ప్రేమకథా చిత్రమ్’ మాదిరిగానే.. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని ఈ సందర్భంగా మహేష్‌బాబు ఆకాంక్షించారు. 
 
 కృష్ణ మాట్లాడుతూ -‘‘సుధీర్ తొలి సినిమాతో నటుడిగా మంచి మార్కులు సాధించాడు. రెండో సినిమాతో హిట్ సినిమా హీరో అనిపించుకున్నాడు. ఈ మూడో సినిమాతో మాస్ హీరోగా ఎదగాలి’’ అని చెప్పారు. ‘‘కృష్ణగారిని ఏమడిగినా కాదనలేరు. వెంటనే సపోర్ట్ ఇస్తారు. కానీ మహేష్ అలా కాదు. ప్రొఫెషనల్‌గా ఎలాంటి సహకారం అందించాలన్నా ముందు వాళ్ల అర్హత ఏంటో చూస్తాడు. అర్హత లేని వాళ్లను మహేష్ ఎంకరేజ్ చేయడు. హీరోగా ఎదగడానికి నాకు మహేష్ సపోర్ట్ అవసరం. తననుంచి సహకారం అందాలంటే... ముందు నాకు కొన్ని అర్హతలుండాలి. 
 
 అందుకే హీరోకి ఉండాల్సిన అర్హతలన్నింటినీ సాధించాలని ఇండస్ట్రీకి రాకముందే డిసైడ్ అయ్యాను. ఇప్పుడు నాకు కెరీర్‌పై భయం లేదు. ఎందుకంటే... నాకు సపోర్ట్ మహేష్ ఉన్నారు. ఆయన అభిమానులున్నారు. జీవితాంతం కష్టపడతాను. నన్నెక్కడ కూర్చోబెట్టాలి అనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు’’ అని సుధీర్‌బాబు ఉద్వేగంగా మాట్లాడారు. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతల్లో ఒకరైన ఎస్.ఎన్.రెడ్డి తెలిపారు. ఇంకా విజయనిర్మల, నరేష్, బెల్లంకొండ సురేష్, భీమనేని శ్రీనివాసరావు, గోపిచంద్ మలినేని, వీరు పోట్ల, అజయ్, పూనమ్‌కౌర్, పద్మాలయ మల్లయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.