డబుల్ మీనింగ్ పాటలు నాకిష్టం లేదు

13 Jun, 2016 14:42 IST|Sakshi
డబుల్ మీనింగ్ పాటలు నాకిష్టం లేదు

డబుల్ మీనింగ్ పాటలు, తిట్లు ఎక్కువగా ఉండే పాటలంటే తనకు ఏమాత్రం ఇష్టం లేదని 'బేబీ డాల్', 'చిట్టియా కలైయ్యా' లాంటి పాటలతో మంచి గాయనిగా హిట్‌ అయిన కనికా కపూర్ చెప్పింది. ఈ రోజుల్లో డబుల్ మీనింగ్ పాటల ట్రెండ్ ఎక్కువైందని వాపోయింది. తిట్లతో ఉండే పాటలు తనకు ఇష్టం లేదని, వాటిని చాలా నీచంగా చూస్తానని, అది స్క్రిప్టులో భాగం అయితే తప్ప అసలు చేయబోనని ఆమె తెలిపింది.

చెడు అర్థాలు వచ్చే పాటలను అసలు తాను పాడబోనంది. ఎలాంటి అండదండలు లేకుండా నేరుగా సినీ పరిశ్రమకు వచ్చిన కనికా కపూర్.. ఈ రంగంలో తన ప్రయాణం చాలా అద్భుతంగా సాగుతోందని అంటోంది. నిజానికి ఈ స్థాయి వరకు రావడానికి తాను చాలా పోరాటం చేయాల్సి వచ్చిందని తెలిపింది. తనకు 8 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి పాడుతున్నానని, ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని కనిక అంటోంది. ఏ వ్యాపారంలోనైనా అవతలివాళ్లను ఒప్పించగలిగేలా ఉండాలని, అలాగే నిలకడ కూడా అవసరమని.. గాయనిగా తాను తన గుండె లోతుల్లోంచి పాడతానని ఆమె చెప్పింది. తనవరకు వచ్చేసరికి.. సంగీతమే తన వ్యాపారమని.. తన కోసమే తాను పాడతానని వివరించింది.