‘సింగం–3’ తర్వాత సినిమాలు చేయకూడదనుకున్నా

21 Mar, 2018 01:06 IST|Sakshi

మల్కాపురం శివకుమార్‌

‘‘గతంలో ‘గులేబకావళి’ టైటిల్‌తో విడుదలైన సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా తప్పకుండా సక్సెస్‌ సాధిస్తుంది. ట్రైలర్, పాటలు చూస్తుంటే సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆసక్తి కలుగుతోంది’’ అని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. ప్రభుదేవా, హన్సిక జంటగా రేవతి ప్రధాన పాత్రలో కల్యాణ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గులేబకావళి’. తమిళంలో సంక్రాంతికి విడుదలై హిట్‌ అయిన ఈ చిత్రాన్ని అదే పేరుతో మల్కాపురం శివకుమార్‌ తెలుగులో ఏప్రిల్‌ 6న విడుదల చేస్తున్నారు. వివేక్‌ మెర్విన్‌ స్వరపరచిన ఈ సినిమా బిగ్‌ సీడీని రసమయి బాలకిషన్‌ విడుదల చేశారు. ఆడియో సీడీలను దర్శకుడు ఎన్‌.శంకర్‌ విడుదల చేయగా, నటి జీవిత తొలి సీడీ అందుకున్నారు.

ఈ సందర్భంగా మల్కాపురం శివకుమార్‌ మాట్లాడుతూ– ‘‘సింగం 3’ తర్వాత సినిమాలు చేయడం ఆపేద్దామనుకున్నా. ఇండస్ట్రీలో సక్సెస్‌ అయితే తర్వాతి సినిమా ఏంటని అడుగుతారు. ఫ్లా్లప్‌ అయితే ఎవరూ కనిపించరు. కానీ, పది మందికి ఆదరణ చూపే ఇండస్ట్రీ ఇది. ఎంతోమంది చిత్ర పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు. తమిళం రాకున్నా ‘గులేబకావళి’ సినిమా చూసి సాధారణ ప్రేక్షకునిగా ఎంజాయ్‌ చేశా. తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనిపించి విడుదల చేస్తున్నా’’ అన్నారు. ‘‘దర్శకుడిగా నా తొలి చిత్రమిది. తమిళ ప్రేక్షకులను అలరించినట్టు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే చిత్రమవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు కల్యాణ్‌.  

మరిన్ని వార్తలు