నేను పెళ్లే చేసుకోను!

14 Aug, 2019 06:46 IST|Sakshi

సినిమా: తాను జీవితంలో పెళ్లే చేసుకోను అని సంచలన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయం గురించి ఈమె ఇంతకు ముందే చెప్పిన విషయం తెలిసిందే. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌. వాటిలో ఒకటి నటుడు విమల్‌కు జంటగా నటించిన చిత్రం కన్నిరాశి. కింగ్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై షమీమ్‌ ఇబ్రహీం నిర్మించిన ఈ చిత్రానికి ఎస్‌.ముత్తుకుమార్‌ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ మంగళవారం చెన్నైలోని ఒక నక్షత్రహోటల్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దర్శకుడు ముత్తుకుమార్‌ మాట్లాడుతూ ఇదే తన తొలి చిత్రం అని తెలిపారు. దర్శకుడిగా అవకాశం కల్సించిన నిర్మాతకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. సంగీతదర్శకుడు విశాల్‌ చంద్రశేఖర్‌ సూపర్‌ సంగీతాన్ని అందించారని తెలిపారు. తదుపరి చిత్రంలోనూ ఆయనతో కలిసి పనిచేస్తానని అన్నారు.

పెద్ద పోరాటం తరువాతనే ఈ చిత్రం విడుదల వరకూ వచ్చిందని అన్నారు. యోగిబాబు, రోబోశంకర్‌ అద్భుతంగా నటించారని చెప్పారు. నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఈ చిత్రానికి ఏం కావాలో అలా నటించారని చెప్పారు.  మనం చెప్పింది చెప్పినట్టుగా నటించిన నటుడు విమల్‌ అని అన్నారు. ఆయన కారణంగానే తనకీ అవకాశం వచ్చిందని చెప్పారు. ఇది వినోదభరితంగా సాగే కుటుంబ కథా చిత్రంగా ఉంటుం దని, తాను ఇంత కు ముందు చా లా మంది హీరోయిన్లతో కలిసి నటించానని అన్నారు. అయితే తొలిసారిగా ఒక మగాడు లాంటి నటి(వరలక్ష్మీశరత్‌కుమార్‌)తో నటించానని నటుడు విమల్‌ పేర్కొన్నారు. నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ మాట్లాడుతూ సాధారణంగానే తనకు నూతన దర్శకులంటే ఇష్టం అని అన్నారు. ఈ చిత్ర స్క్రిప్ట్‌ చదువుతున్నప్పుడే కడుపుబ్బ నవ్వానని చెప్పారు.   ఇది ప్రేమ వివాహం నేపథ్యంలో సాగే చిత్రంగా ఉంటుందని తెలిపింది. అయితే నిజ జీవితంతో తనకు వివాహంపై నమ్మకం లేదని, జీవితంలో తానెవరినీ పెళ్లే చేసుకోనని అన్నారు. పాండిరాజన్, యోగిబాబు, రోబోశంకర్‌తో కలిసి జాలీగా నటించినట్లు తెలిపారు. నటుడు విమల్‌ మంచి నటుడని, ఆయనతో కలిసి నటించడం మంచి అనుభవం అని పేర్కొన్నారు. కన్నిరాశి పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టెయినర్‌గా ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు