తండ్రిగా చాలా ఆనందిస్తున్నాను

4 Sep, 2013 01:28 IST|Sakshi
తండ్రిగా చాలా ఆనందిస్తున్నాను
‘‘బోల్డ్‌గా ఉన్న పాయింట్‌ని అన్ని వర్గాల ప్రేక్షకులకూ చేరువయ్యేలా సినిమా తీయడం చాలా కష్టం. ఈ విషయంలో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ విజయం సాధించాడు. తక్కువ వసూళ్లతో ప్రారంభమై... ఈ రోజున భారీ వసూళ్ల స్థాయికి చేరుకుందీ సినిమా. సినిమా చూసిన వారందరూ బాగుంది అంటుంటే... సుమంత్ అశ్విన్ తండ్రిగా చాలా ఆనందంగా ఉంది’’ అని ఎమ్మెస్ రాజు అన్నారు. 
 
 సుమంత్ అశ్విన్ కథానాయకునిగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో కె.ఎల్.దామోదరప్రసాద్ నిర్మించిన చిత్రం ‘అంతకు ముందు- ఆ తరువాత’. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని సుమంత్ అశ్విన్ తండ్రి, ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు ఆనందం వ్యక్తం చేశారు. 
 
 ఆయన ఇంకా చెబుతూ -‘‘సుమంత్ అశ్విన్ తొలి సినిమా ‘తూనీగ తూనీగ’ అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా... తన సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ఆలోచించకుండా ఒక మంచి కథకు కథానాయకునిగా ఎంచుకున్న దర్శకనిర్మాతలకు ముందు థ్యాంక్స్ చెబుతున్నాను.
 
 బౌండ్ స్క్రిప్ట్‌తో ఇంద్రగంటి మా వద్దకొచ్చారు. విన్న వెంటనే నచ్చిందీ కథ. అందుకే ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాడు సుమంత్. ఇప్పటివరకూ నేను చాలా విజయాలను అందుకున్నాను. అవేవీ ఇవ్వనంత ఆనందాన్ని ఈ సినిమా ఇచ్చింది’’ అన్నారు ఎమ్మెస్ రాజు.