నా కథను నేను రాసుకున్నా

20 Jun, 2018 00:06 IST|Sakshi

‘‘పెళ్ళి చూపులు’’ సినిమా 2016జూలై 29న విడుదలైనా నిన్ననే రిలీజ్‌ అయినట్లు ఉంది. ‘పెళ్లి చూపులు’ సినిమా చూసిన సురేశ్‌బాబుగారు ఈ సినిమా 100 రోజులు ఆడుతుందన్నారు. నవంబర్‌ 5న ఆ సినిమా 100వ రోజు. అదేరోజు నా పుట్టిన రోజు కావడం విశేషం’’ అని దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ అన్నారు. విశ్వక్‌ సేన్, సాయి సుశాంత్, వెంకట్‌ కకుమను, అభినవ్‌ గోమతం, అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్‌ చౌదరి ముఖ్య తారలుగా ఆయన దర్శకత్వంలో డి.సురేశ్‌ బాబు నిర్మించిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం ఈనెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా యూనిట్, కొందరు సామాన్యులకు చిత్రం ప్రదర్శించారు. అనంతరం తరుణ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ– ‘‘పెళ్లి చూపులు’ సినిమా తర్వాత నా రెండో సినిమాకి సురేశ్‌బాబుగారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు.

ఏ కథ రాయాలని చాలా ఆలోచించా. చాలా మంది వద్ద సలహాలు తీసుకున్నా. ఆ టైమ్‌లో ‘నా గురించే నేను ఎందుకు రాసుకోకూడదు?’ అనిపించి, నా కథను నేను రాసుకున్నా. నా ఫ్రెండ్స్‌ గురించి, మా జీవన ప్రయాణంలో జరిగిన సంఘటనలను ‘ఈ నగరానికి ఏమైంది’ కథ రాశా. సినిమాలో సస్పెన్స్‌ ఎలిమెంట్స్‌ ప్రేక్షకులకు కొత్త ఫీల్‌ కలిగిస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నికేత్‌ బొమ్మిరెడ్డి, సంగీతం: వివేక్‌ సాగర్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వెంకట్‌ సిద్దారెడ్డి, కో ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: శ్రీనివాస్‌ కౌశిక్, లైన్‌ ప్రొడ్యూసర్‌: సాయికరణ్‌ గద్వాల్‌.  

మరిన్ని వార్తలు