ప్రతిరోజూ కూల్‌గా...

18 Sep, 2018 00:46 IST|Sakshi
నభా నటేశ్‌

‘‘తెలుగులో నా తొలి చిత్రం ‘అదుగో’. రెండో సినిమా ‘నన్ను దోచుకుందువటే’. అయితే.. విడుదల పరంగా చూస్తే ‘నన్ను దోచుకుందువటే’ నా మొదటి చిత్రం. నేను నటించిన కన్నడ సినిమాలు చూసిన ఆర్‌.ఎస్‌. నాయుడుగారు నన్ను సంప్రదించారు. కథ, నా పాత్ర నచ్చడంతో నటించా’’ అని నభా నటేశ్‌ అన్నారు. సుధీర్‌ బాబు, నభా నటేశ్‌ జంటగా ఆర్‌.ఎస్‌. నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. సుధీర్‌బాబు హీరోగా నటించి, నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నభా నటేశ్‌ మాట్లాడుతూ– ‘‘నేను కన్నడ అమ్మాయిని. తెలుగు మాట్లాడటం వచ్చు. అయితే వాక్య నిర్మాణం చక్కగా ఉండదు.

తెలుగు సినిమాల్లో నటించడం వల్ల ఇప్పుడు బాగా నేర్చుకున్నా. సినిమాల్లోకి రావాలనే ఆలోచనతో కాలేజీ రోజుల్లోనే థియేటర్‌ ఆర్టిస్ట్‌గా కోర్సు చేసి, చాలా స్టేజ్‌ షోస్‌ చేశా. మోడలింగ్‌ కూడా చేశాను. థియేటర్‌తో పోల్చితే కెమెరా యాక్టింగ్‌ కొంచెం వైవిధ్యంగా ఉంటుంది. ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంలో అన్ని ఎమోషన్స్‌ ఉన్న పాత్ర చేశా. హోమ్‌ వర్క్‌ చేయడం వల్ల చాలా కూల్‌గా చేయగలిగాను. ఇలాంటి పాత్ర చేయడం నాకు చాలా సంతోషాన్నివ్వడంతో పాటు ప్రతిరోజూ కొత్తగా అనిపించేది. సుధీర్‌గారు మంచి సహనటుడు, నిర్మాత. కొత్త హీరోయిన్‌ కాబట్టి నాకు మంచి స్పేస్‌ ఇచ్చారు.  సుధీర్‌గారు, నాయుడుగారు నాపై నమ్మకంతో ఇంత మంచి అవకాశం ఇవ్వడం నా లక్‌’’ అన్నారు.

మరిన్ని వార్తలు