'ఇద్దరి మధ్య 18' ఆడియో విడుదల

27 Feb, 2017 18:01 IST|Sakshi
'ఇద్దరి మధ్య 18' ఆడియో విడుదల
రాం కార్తీక్‌, భాను త్రిపాఠి జంటగా బిత్తిరిసత్తి ప్రధానపాత్రలో నటించిన 'ఇద్దరి మధ్య 18' ఆడియో విడుదల ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ మంత్రి హరీష్‌రావు ఆడియోను విడుదల చేశారు. ఎస్‌.ఆర్‌.పి విజువల్‌ పతాకంపై సాయితేజ పాటిల్‌ సమర్పణలో శివరాజ్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాని ఆచార్య ఈ మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆడియో విడుదల కార్యక్రమానికి మైనంపల్లి హనుమంతరావు, జీవిత, ఎన్.శంకర్‌, మల్కాపురం శివకుమార్‌, సినిమా యూనిట్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. రాజకీయాల్లో తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్న శివరాజ్‌ పాటిల్‌.. సినీరంగంలో కూడా రాణించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 
 
చిత్ర నిర్మాత శివరాజ్‌ పాటిల్‌ మాట్లాడుతూ.. సినిమా ఆడియోని ఆవిష్కరించిన తెలంగాణ మంత్రి హరీష్‌రావుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. యూత్‌ని ఆట్టుకునే అన్ని కమర్షియల్‌ హంగులతో, ఒక చక్కని మెసేజ్‌ను మిళితం చేసి దర్శకుడు నాని ఆచార్య చిత్రాన్ని తెరకెక్కించారని అన్నారు. ఘంటాడి కృష్ణ అందించిన పాటలు ప్రేక్షకులని మెప్పిస్తాయని చెప్పారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయినట్లు వెల్లడించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ.. తనకు ఇది 50వ చిత్రమని చెప్పారు. సంగీత దర్శకుడిగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ తనకు ఈ చిత్రంతో ఆరంభం అవుతోందని, ఈ సినిమా మంచి సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.