అమీర్ సంచలన వ్యాఖ్యలపై దుమారం

24 Nov, 2015 09:58 IST|Sakshi
అమీర్ సంచలన వ్యాఖ్యలపై దుమారం

ముంబై: భారత్ వదిలిపెట్టి పోదామని తన భార్య అడుగుతోందన్న  బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలపై  ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ సోషల్ మీడియాలో స్పందించారు.  అమీర్ కు ఎక్కడ శాంతి ఉంటుందనుకుంటే అక్కడి  వెళ్లిపోవచ్చని, ఆ స్వతంత్రత ఆయనకుందంటూ ట్విట్ చేశారు. ఇక్కడ  జీవించడానికి భయంగా ఉంటే ఎక్కడికైనా వెళ్లి జీవించే స్వేచ్ఛ అమీర్ ఖాన్ కు ఉందని మనోజ్ తివారీ ట్విట్టర్లో  వ్యాఖ్యానించారు.


ఒక్క క్షణంలో ఇంత తీవ్రమైన ఆరోపణలు చేసి భారతమాతకు తీరని కళంకాన్ని ఆపాదించారని మనోజ్ తివారీ మండిపడ్డారు.  ఎంత  పొరబాటుగా మాట్లాడారో ఇప్పటికైనా ఆలోచించాలని  అమీర్ కు ఆయన సూచన చేశారు.  అమీర్ ప్రకటన షాక్కు గురి చేసిందని, అలాంటి వ్యాఖ్యలు చేయడం తనకు  చాలా బాధ కలిగించిందన్నారు. అయినా తనలాంటి అభిమానులు అమీర్ పై కురిపించిన ప్రేమ,ఆప్యాయతలు ఇక ముందు కూడా  కొనసాగాలంటూ మనోజ్ తివారీ ఆకాంక్షించారు.

కాగా దేశంలో ఆరు నెలలుగా అభద్రతా పరిస్థితులు నెలకొన్నాయని  వ్యాఖ్యలు చేసిన  అమీర్,   తమ పిల్లల విషయంలో తన భార్య కిరణ్ ఆందోళన చెందుతోందన్నారు. దేశం వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్లాలని కూడా ఆలోచించిందని ఆయన  చెప్పిన సంగతి తెలిసిందే.