'ఇప్పడు ఆమె మాట నేను వింటున్నా'

9 Jul, 2015 19:14 IST|Sakshi
'ఇప్పడు ఆమె మాట నేను వింటున్నా'

ముంబై: పెళ్లైన కొత్తలో తన భార్య పూనమ్ తన మాట వినేదని, ఇప్పుడు ఆమె మాట తాను వింటున్నానని బాలీవుడ్ సీనియర్ నటుడు, బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా చమత్కరించారు. తమ వివాహ బంధానికి 35 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఓ మేగజీన్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.

'అంతకుముందు పూనమ్ నా బాటలో నడిచేది. అప్పుడు మా కుటుంబ నౌకకు నేనే కెప్టెన్ గా ఉండి ముందుండి నడిపేవాడిని. కానీ ఇప్పుడు ఆమె వెనుక నేను నడుస్తున్నాను. ఆమె ఆదేశాలు శిరసావహిస్తున్నాను. ఈ 35 ఏళ్లలో ఆమె ప్రాధాన్యాలు మారిపోయాయి. పూనమ్ ప్రాధాన్యాల్లో నా నంబర్ 4. మొదటి మూడు స్థానాలు మా పిల్లలు లవ్, కుశ్, సోనాక్షివి' అని శత్రుఘ్నసిన్హా పేర్కొన్నారు.

అయితే మరొకరి పేరు మర్చిపోయారని, ఆమె తమ కుశ్ భార్య తరుణా సిన్హా అని ఆయనకు పూనమ్ గుర్తు చేశారు. అయితే ఇప్పుడు తన నంబర్ 5 అని శత్రుఘ్నసిన్హా నవ్వుతూ అన్నారు.

'సబక్' సినిమాలో కలిసి నటించిన శత్రుఘ్నసిన్హా, పూనమ్ 1980, జూలై 9న వివాహం చేసుకున్నారు. తమ తల్లిదండ్రుల పెళ్లిరోజును పురస్కరించుకుని సొనాక్షి సిన్హా తన ట్విటర్ పేజీలో శత్రుఘ్నసిన్హా, పూనమ్ ఫోటో పోస్ట్ చేసింది.