ఇంటర్‌నెట్ నేపథ్యంలో....

26 Mar, 2014 00:18 IST|Sakshi
ఇంటర్‌నెట్ నేపథ్యంలో....

‘‘దర్శకునిగా కొనసాగుతూ, నిర్మాతగా కొన్ని సినిమాలు తీయాలనుకుని చాలా కథలు విన్నాను. నా దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసే ముంజునాథ్ చెప్పిన కథ నన్ను బాగా ఆకట్టుకుంది. అలా తన దర్శకత్వంలో ఈ సినిమా చేశాను’’ అని ‘మధుర’ శ్రీధర్ చెప్పారు. చైతన్యకృష్ణ, అడివి శేష్, మహత్ రాఘవేంద్ర, కమల్ కామరాజు, నిఖితా నారాయణ్, జాస్మిన్, స్వాతి దీక్షిత్ ముఖ్య తారలుగా పి.బి. మంజునాథ్ దర్శకత్వంలో ఎమ్.వి.కె.రెడ్డి, ‘మధుర’ శ్రీధర్ నిర్మిస్తున్న చిత్రం ‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్’ ఫస్ట్ లుక్ ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.


ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ-‘‘ఇంటర్‌నెట్ వల్ల మంచి ఎంత జరుగుతుందో, చెడూ అంతే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. కథ నచ్చి ఈ సినిమాలో భాగస్వామిగా చేరానని రాజ్ కందుకూరి చెప్పారు. ఇందులో తమవి చాలా మంచి పాత్రలని చెతన్యకృష్ణ, అడివి శేష్, కమల్ కామరాజు చెప్పారు. ఈ కార్యక్రమంలో సుధీర్ వర్మ, కల్యాణ్ తదితర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.