మా సినిమాపై నమ్మకం ఉంది

19 Dec, 2016 00:01 IST|Sakshi
మా సినిమాపై నమ్మకం ఉంది

సన్ని, అక్షిత, ప్రశాంత్, ప్రసన్న ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘ఇంకేంటి నువ్వే చెప్పు’. శివ శ్రీ దర్శకత్వంలో వెల్ఫేర్‌ క్రియేషన్స్‌ పతాకంపై డా. మళ్ల విజయ్‌ ప్రసాద్‌ నిర్మించారు. వికాస్‌ స్వరాలందించిన ఈ చిత్రం ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. చిత్ర నిర్మాత మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. వినోదం పంచుతూనే సందేశం ఇచ్చేలా ఉంటుంది. మా బ్యానర్‌ విలువకు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉంటుంది. ఈ నెలలో పెద్ద చిత్రాల విడుదల ఉన్నప్పటికీ, మా సినిమాపై ఉన్న నమ్మకంతో మేం కూడా ఈ నెలలోనే రిలీజ్‌ చేస్తున్నాం’’ అని చెప్పారు.

‘‘కొత్త వాళ్లతో సినిమా తీయాలంటే ధైర్యం ఉండాలి. విజయ్‌ప్రసాద్‌ ఆ ధైర్యంతోనే ఈ చిత్రం తీశారు. అనుభవం ఉన్నవాడిలా దర్శకుడు ఈ చిత్రం తెరకెక్కించారు’’ అని ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్‌ అన్నారు. చిత్ర దర్శకుడు శివ శ్రీ, నిర్మాత కె.ఎస్‌.రామారావు, సన్ని, అక్షిత, ప్రశాంత్, ప్రసన్న, వికాస్‌ తదితరులు పాల్గొన్నారు.