ఆ వైకుంఠపురము.. ఎవరిదంటే!

17 Jan, 2020 12:30 IST|Sakshi

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటికొచ్చింది. అల.. వైకుంఠపురములో.. చిత్రంలో కనిపించే ఇల్లు సెట్‌ కాదని తెలిసింది. అయితే అత్తారింటికి దారేది చిత్రం కోసం రామోజీఫిల్మ్‌ సిటీలో త్రివిక్రమ్‌.. ఓ భారీ సెట్‌ వేయించారు. దీంతో ఈ చిత్రంలో ఇంటికి కూడా అలానే సెట్‌ వేశారని అనుకున్నారు. కానీ ఈ చిత్రాన్ని రియల్‌ ఇంట్లోనే షూట్‌ చేశారు. ఓ ప్రముఖ న్యూస్‌ చానల్‌ అధినేత కుమార్తె అత్తింటివారికి చెందిన నివాసం అది. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆ విలాసవంతమైన ఇంటిని ఓసారి అనుకోకుండా చూసిన త్రివిక్రమ్‌.. తన కథకు సరిపడే ఇళ్లు దొరికిందని సంతోషించాడు.

ఈ మేరకు ఇంటి యజమానులతో త్రివిక్రమ్‌ చర్చలు జరిపారు. అలాగే ఆ ఇంటి యజమానులు హారిక హాసిని ప్రొడక్షన్‌ వారికి బంధువులు కావడంతో.. వారు ఆ ఇంటిని షూటింగ్‌కు ఇచ్చేందుకు అంగీకరించినట్టుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు ఇరవై రోజుల పాటు అల.. వైకుంఠపురములో.. చిత్రం షూటింగ్‌ ఆ ఇంట్లోనే జరిగింది. ఈ చిత్రంలో వన్‌ ఆఫ్‌ ది అట్రాక్షన్‌గా నిలిచింది. అయితే చిత్రం షూటింగ్‌ సమయంలో ఆ ఇంటిని చూసిన బన్నీ.. కూడా విలాసవంతమైన ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ ఇంటికి సంబంధించిన వివరాలను యజమానులను అడిగి తెలుసుకున్న బన్నీ.. అదే స్థాయిలో బంజారాహిల్స్‌లో ఓ ఇంటిని నిర్మించుకోబోతున్నాడు. అల.. వైకుంఠపురములో.. షూటింగ్‌ జరుగుతన్న సమయంలో తన కొత్త ఇంటికి భూమి పూజ చేసిన బన్నీ.. ఇటీవల ఆ చిత్రం థ్యాంక్స్‌ మీట్‌లో కూడా కొత్తింటి విషయాన్ని ప్రస్తావించాడు. ఆ ఇంటికి తన తండ్రిని డబ్బులు అడుగుతానని కూడా బన్నీ చెప్పాడు. దీంతో ప్రస్తుతం బన్నీ కడుతున్న ఇల్లు ఏ రేంజ్‌లో ఉంటుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

మరిన్ని వార్తలు