నాన్న కోరిక మేరకే హీరోనయ్యా

22 Jun, 2014 12:03 IST|Sakshi
నాన్న కోరిక మేరకే హీరోనయ్యా

‘ఓ మంచి కథ సిద్ధం చేసుకుని దర్శకత్వం చేపట్టాలని ఉంది...అన్న బాటలో నడుస్తూ సత్తా చాటాలని ఉంది’ అని పూరిజగన్నాథ్ తమ్ముడు, నటుడుసాయిరామ్ శంకర్ అన్నారు. పెదపూడిలో గోవిందమాంబసమేత వీరబ్రహ్మేంద్ర స్వామి, లలితాదేవి ఆలయాల ప్రారంభోత్సవం, విగ్రహప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు.


జి.మామిడాడకు చెందిన తన క్లాస్‌మేట్, స్నేహితుడు బ్రహ్మశ్రీ వీరవల్లి సత్యశ్రీ లలితా భాగ్యదత్ (పెదబాబు సిద్ధాంతి) ఆహ్వానంపై ఇక్కడకు వచ్చానన్నారు. అలాగే రాయవరం మండలం పసలపూడి సినీ నిర్మాత తాడి గనిరెడ్డి ఇంటికి కూడా వెళ్లారు. జి.మామి డాడలో, పసలపూడిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్నయ్య దగ్గర ఏడేళ్లు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశానన్నారు. అందులో బద్రి, ఇట్లుశ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ వంటి హిట్ చిత్రాలున్నాయన్నారు. అన్నయ్య పూరి అంటే ఎనలేని అభిమానమని చెప్పారు.  తండ్రి కోరిక మేరకే హీరోనయ్యానని పేర్కొన్నారు.

 

ఇంతవరకు ఎనిమిది సినిమాల్లో హీరోగా, రెండు సినిమాల్లో ఇతర పాత్రల్లో నటించానన్నారు. నాకు పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా బంపర్ ఆఫర్ అని చెప్పారు. తన కొత్త చిత్రం తమిళ హీరో శరత్‌కుమార్‌తో కలిసి నటించిన ‘రోమియో’త్వరలో విడుదలవుతోందన్నారు. ఈ సినిమాకు కథ అన్నయ్య పూరి జగన్నాథ్ సమకూర్చారన్నారు. మరో చిత్రం షూటింగ్ జరుగుతోందన్నారు. మంచి హిట్ సినిమా తీయాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.