‘ఎంత బాధనైనా చిరునవ్వుతో భరిస్తాను’

16 Jul, 2018 12:04 IST|Sakshi

బాలీవుడ్‌ క్లాసిక్‌ హీరో ఇర్ఫాన్‌ ఖాన్‌ అరుదైన ‘న్యూరో ఎండోక్రైనో’ అనే క్యాన్సర్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లండన్‌లో చికిత్స పొందుతున్న ఈ హీరో ఆదివారం తన డీపీ(డిస్‌ప్లే పిక్చర్‌)ని చేంజ్‌ చేశారు. అయితే ఈ ఫోటో అభిమానులను విపరీతంగా కదిలించడమే కాక తెగ వైరల్‌ అవుతుంది. సాధరణంగా క్యాన్సర్‌ వ్యాధికి చికిత్స అంటే ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవించిన వారికే తెలుస్తుంది.

కానీ ఇర్ఫాన్‌ ఫోటో చూసిన వారికి కూడా ఆ బాధ ఎలా ఉంటుందో బాగానే అర్ధం అవుతుంది. ఇర్ఫాన్‌ ఖాన్‌ షేర్‌ చేసిన ఈ ఫోటోలో అతను బాగా నీరసించి, బక్కచిక్కపోయి ఉన్నట్లు స్పష్టంగా అర్ధమవుతుంది. కానీ ఇంతటి విచారాన్ని కూడా ఈ నటుడు చిరునవ్వుతో భరిస్తున్నాడు. శరీరం ఎంత బలహీన పడినా ఇర్ఫాన్‌ ధైర్యం మాత్రం తగ్గలేదు. అందుకు నిదర్శనం అతని మోముపైన చిరునవ్వే.

ఇర్ఫాన్‌ న్యూరో ఎండోక్రైన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఈ ఏడాది మార్చిలో తెలిసింది. దాంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తనకొచ్చిన అరుదైన వ్యాధి గురించి ఇర్ఫాన్‌ ఖాన్‌ ఒక భావోద్వేగపూరితమైన లేఖను రాశారు. ఈ లేఖలో ‘ఊహించని ఉపద్రవాలతో కూడిందే జీవితం. మనం ఏదో అనుకుంటాం, కానీ మనం అనుకోనిదేదో జరుగుతుంది. ఇలాంటి అనుకోని సంఘటనలే మన జీవితాన్ని మార్చివేస్తాయి. గత కొన్ని రోజుల్లోనే ఈ విషయం నాకు బాగా అర్ధమయ్యింది.

నేను అరుదైన న్యూరో ఎండోక్రైన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. కానీ నా చుట్టూ ఉన్న వారి ప్రేమ, ఆశీస్సులే నాకు బలానిస్తున్నాయి. అవే నాకు నమ్మకాన్ని కల్గిస్తున్నాయి. ఈ ప్రయాణంలో భాగంగా(చికిత్స కోసం) నేను దేశం దాటి వెళ్తున్నాను. నేను ప్రతి ఒక్కరిని కోరేది ఒక్కటే మీ ఆశీస్సులను నిరంతరం నాకు అందిస్తూనే ఉండండి. త్వరలోనే వచ్చి నా ఈ ప్రయాణానికి సంబంధించిన మరిన్ని కబుర్లు మీకు చెబుతాను అంటూ లేఖలో తెలిపారు.

లండన్‌ వెళ్లిన తర్వాత ఈ నటుడు కర్వాన్‌లో తనతో పాటు నటించిన దుల్కర్‌ సల్మాన్‌, మిథిలా పాకర్‌కు శుభాకాంక్షలు తెలిపడం కోసం తొలిసారి సోషల్‌ మీడియాలోకొచ్చారు. ఇర్ఫాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆగస్టులో విడుదల కానుంది.

మరిన్ని వార్తలు