మళ్లీ షూటింగ్‌లోకి ఇర్ఫాన్‌ ఖాన్‌ !

18 Apr, 2019 18:16 IST|Sakshi
ఇర్ఫాన్‌ ఖాన్‌

న్యూఢిల్లీ: భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత నైపుణ్యమున్న నటుల్లో ఇర్ఫాన్‌ ఖాన్‌ ఒకరు. ఆయన కొంతకాలంగా న్యూరోఎండోక్రైన్‌ అనే క్యాన్సర్‌తో బాధపడుతున్న సంగతి తెల్సిందే. చికిత్స నిమిత్తం విదేశాలకు కూడా వెళ్లిన విషయం విదితమే. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలిసింది. ఇటీవలే  ‘అంగ్రేజీ మీడియం’  షూటింగ్‌లో పాల్గొన్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు కూడా పెట్టారు. ఇర్ఫాన్‌ ఖాన్‌ ఆరోగ్యం మెరుగుపడటం పట్ల ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2017లో ఆయన నటించిన ‘హిందీ మీడియం’  చిత్రం బ్లాక్‌బస్టర్డ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దానికి సీక్వెల్‌గా ‘అంగ్రేజీ మీడియం’ తెరకెక్కిస్తున్నారు.  ఈ చిత్ర షూటింగ్‌నకు సంబంధించిన ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.


అభిమానులు షేర్‌ చేసిన చిత్రం

ఆయన అభిమానుల్లో ఒకరు ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేశారు. ఈ ఫోటోలో ఇర్ఫాన్‌ ఖాన్‌, అంగ్రేజీ మీడియం డైరెక్టర్‌ హోమి అడజానియాతో ఉల్లాసంగా మాట్లాడుతూ కనిపించారు. దీనిని బట్టి ఇర్ఫాన్‌ ఖాన్‌ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు ఆయన అభిమానులు భావిస్తున్నారు. అంగ్రేజీ మీడియంలో ఇర్ఫాన్‌ ఖాన్‌, ‘పటాకా’ ఫేమ్‌ నటి రాధికా మదన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ ఖాన్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. రాధికా మదన్‌, ఇర్ఫాన్‌ ఖాన్‌ కుమార్తెగా ఈ చిత్రంలో నటిస్తోంది. అభిమానులు తన పట్ల చూపుతోన్న ఆదరాభిమానాలకు ఇర్పాన్‌ ఖాన్‌ కృతజ్ఞతలు తెలిపారు. అంగ్రేజీ మీడియం సినిమా 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

మరిన్ని వార్తలు