ఒక్కపైసా తీసుకోకుండా ఆ సినిమా చేశాడా!

22 Nov, 2015 16:47 IST|Sakshi
ఒక్కపైసా తీసుకోకుండా ఆ సినిమా చేశాడా!

'బాజీరావు మస్తానీ'.. రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే అత్యంత భారీ సినిమా. ఆయన ఇప్పటివరకు పోషించిన పాత్రల్లో అత్యంత కఠినమైన పాత్ర ఇదే అవుతుందని భావిస్తున్నారు.  దర్శకుడు సంజయ్‌లీలా భన్సలీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమాలో టైటిల్ రోల్‌ బాజీరావు పాత్రను రణ్‌వీర్‌ సింగ్ పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో టాప్‌ ట్రెండింగ్‌గా దూసుకుపోతున్నది. మరాఠా సామ్రాజ్య వైభవానికి వెండితెర దృశ్యరూపంగా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి మరో వార్త తాజాగా హల్‌చల్‌ చేస్తున్నది.

ఈ సినిమా కోసం ఒక్క రూపాయి పారితోషికం కూడా రణ్‌వీర్ సింగ్‌ తీసుకోలేదట. నిర్మాతల నుంచి ఒక్క పైసా తీసుకోకుండా రణ్‌వీర్ ఈ పాత్ర పోషించారని, పారితోషికానికి బదులు ఆయన సినిమా లాభాల్లో వాటా తీసుకోవడానికి మొగ్గు చూపారని చిత్ర యూనిట్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అత్యంత భారీతనంతో, చారిత్రక ప్రేమకథగా రూపొందిన 'బాజీరావు మస్తానీ' బడ్జెట్‌ రూ. 130 కోట్లకుపైనని తెలుస్తున్నది. నిజానికి ఇటీవల చాలామంది బాలీవుడ్ నటులు పారితోషికానికి బదులు సినిమా లాభాల్లో వాటాలకే ప్రాధాన్యమిస్తున్నారు. హీరోలు షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్‌, అక్షయ్‌కుమార్‌, అజయ్‌దేవగణ్‌తోపాటు హీరోయిన్లు దీపికా పదుకొణే, ఐశ్వర్యరాయ్‌ సైతం ఇదే పంథాను అనుసరించారు.
 

>