ఇషా ఎంగేజ్‌మెంట్‌ : తరలివెళ్తున్న తారాగణం

22 Sep, 2018 10:50 IST|Sakshi

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీల గారాల పట్టి ఇషా అంబానీ ఎంగేజ్‌మెంట్‌ పిరమాల్‌ గ్రూప్‌ వారసుడు ఆనంద్‌ పిరమాల్‌తో నేడు ఇటలీలో అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఇటలీ ఉత్తర ప్రాంతంలోని ఆల్ఫ్స్ పర్వత ప్రాంతాల్లో ఉన్న లేక్ కొమో వద్ద వీరి నిశ్చితార్థం గ్రాండ్‌గా జరగనుంది. వీరి ఎంగేజ్‌మెంట్ కోసం అతిరథ మహారథులు, బాలీవుడ్‌ తారాగణం తరలి వెళ్తోంది. ఇప్పటికే ప్రియాంక చోప్రా, ఆమె కాబోయే భర్త నిక్ జోనస్ ఇటలీకి చేరుకున్నారు. వీరితోపాటు డిజైనర్ మనీష్ మల్హోత్రా కూడా ఇషా ఎంగేజ్‌మెంట్ కోసం లేక్ కొమో వెళ్లారు. శ్రీదేవీ ముద్దు బిడ్డ, ధడక్‌ సినిమా హీరోయిన్‌ జాన్వీ కపూర్‌  కూడా ఈ గ్రాండ్‌ వేడుకకు హాజరయ్యేందుకు ఇటలీకి పయనమయ్యారు. శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ ఇప్పటికే అక్కడికి వెళ్లారు. శుక్రవారమే మిలాన్‌ ఫ్యాషన్‌ వీక్‌ నుంచి వచ్చిన సోనమ్‌ కపూర్‌ కూడా ఈ వేడుకలో పాలుపంచుకోనున్నారు. సోనమ్‌ తండ్రి కూడా ఈ వేడుకలో సందడి చేయబోతున్నారు.

బాలీవుడ్‌ దర్శకుడు కరణ్ జోహార్ కూడా ఇటలీకి చేరుకున్నారు. మూడు రోజుల పాటు... ఈ వీకెంట్‌ అంతా ఓ పండుగలా ఇషా, ఆనంద్‌ల ఎంగేజ్‌మెంట్‌ను అంబానీ ఫ్యామిలీ నిర్వహిస్తోంది. సెప్టెంబర్‌ 21 నుంచి మొదలైన ఎంగేజ్‌మెంట్‌ వేడుకలు, రేపటి వరకు జరగనున్నాయి. హలీవుడ్‌ సెలబ్రిటీలకు లేక్‌ కోమో ఎంతో ఇష్టమైన ప్రదేశం. అక్కడే గ్రాండ్‌గా అతిథులకు అంబానీ పార్టీ ఇవ్వబోతున్నారు. డిసెంబర్‌లో ఇషా-ఆనంద్ వివాహం జరగనుంది. ఈ ఏడాది మే నెలలో ఆనంద్ ఇషాకు ప్రపోజ్ చేసిన ఫొటోలు బయటకు రావడం.. ఆ తర్వాత వారి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించి లంచ్ పార్టీలు ఇవ్వడం జరిగాయి. ఇషా-ఆనంద్‌ నిశ్చితార్థం జరగనున్న లేక్ కొమో ఉత్తర ఇటలీలోని లాంబార్డీ ప్రాంతంలో ఉంది. అందమైన బీచ్‌లు, చూపుతిప్పుకోనివ్వని ప్రకృతి అందాలకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. పురాతన చర్చిలు, ఫెర్రీలు, పర్యాటకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పడవలు.. ఇలా ఇక్కడ బోలెడు ఆకర్షణలున్నాయి. 

మరిన్ని వార్తలు