డబుల్‌ ఇస్మార్ట్‌ తీస్తాం

9 Jul, 2019 00:32 IST|Sakshi
నభా నటేశ్, పూరి జగన్నాథ్, రామ్, చార్మి, నిధీ అగర్వాల్‌

– పూరి జగన్నాథ్‌

‘‘రామ్‌కి సినిమా తప్ప మరో ధ్యాస ఉండదు. ప్రతి షాట్‌ను వంద శాతం మనసు పెట్టి చేస్తాడు. ‘టెంపర్‌’ సినిమా తర్వాత నాకు మంచి హిట్‌ పడలేదు. విపరీతమైన ఆకలితో ఉన్నప్పుడు రామ్‌ దొరికాడు. తను రామ్‌ పోతినేని కాదు.. రామ్‌ చిరుతపులి. ప్రేక్షకుల ఆశీర్వాదంతో మా సినిమా పెద్ద హిట్‌ అయ్యి.. డబుల్‌ ఇస్మార్ట్‌ సినిమా తీయాలి ’’ అని డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ అన్నారు. రామ్‌ పోతినేని హీరోగా, నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ హీరోయిన్లుగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది.

ఈ సందర్భంగా వరంగల్‌లో ‘ఇస్మార్ట్‌ బోనాలు’ పేరుతో నిర్వహించిన  కార్యక్రమంలో రామ్‌ మాట్లాడుతూ– ‘‘ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందో ఆలోచించుకుంటూ విదేశాలకు వెళ్లిపోయాను. డ్యాన్సులు, ఫైట్స్, లుక్స్‌ సహా అన్నీ ఉండి, సినిమా కొత్తగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారని తెలిసింది. ఆ సమయంలో పూరీగారిని కలిసినప్పుడు ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ ఐడియా వచ్చింది. పూరీగారితో పని చేస్తున్నప్పుడు ఉన్న కిక్కే వేరు’’ అన్నారు. ‘‘ప్రేక్షకుల కోసం చేసిన కంప్లీట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఇది’’ అన్నారు ఛార్మి. ‘‘రామ్‌తో డ్యాన్స్‌ చేయడం చాలా కష్టం’’ అన్నారు నిధీ అగర్వాల్‌. ‘‘ఒక మంచి పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన పూరీగారికి థ్యాంక్స్‌’’ అని నభా నటేశ్‌ అన్నారు.

>
మరిన్ని వార్తలు