-

'వర్మ గురించి మాట్లాడటం వేస్ట్'

10 Jan, 2017 19:05 IST|Sakshi

ట్విట్టర్‌లో ఎప్పుడూ కామెంట్లు పెడుతూ సంచలనాలకు కేంద్రబిందువుగా ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి మాట్లాడటం వేస్ట్ అని చిరంజీవి అన్నారు. ఖైదీ నెం.150 సినిమా ప్రీలాంచ్ వేడుక సందర్భంగా నాగబాబు - వర్మ మధ్య మొదలైన వివాదం గురించి 'సాక్షి టీవీ' ఇంటర్వ్యూలో ఆయనను అడిగినప్పుడు ఇలా స్పందించారు. ఎవరినైనా ఒకళ్లను పొగడాలంటే పొగడచ్చు గానీ, అందుకోసం రెండోవాళ్లను కించపరచడం సరికాదని, రాంగోపాల్ వర్మ అలాగే చేస్తారని అన్నారు. 
 
ఆయన చాలా కుత్సితంగా ఆలోచిస్తారని, తన సినిమా పోస్టర్లు విడుదల చేసినప్పుడు అందులోని లుంగీ స్టిల్ గురించి చాలా ఘోరంగా కామెంట్ చేశారని, అది మంచిపద్ధతి కాదని చెప్పారు. ఆయన చాలా మేధావి అని, తన ఆలోచనలను సక్రమంగా ఉపయోగించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి సినిమాలు చేస్తే బాగుంటుంది గానీ ఇలా కామెంట్లు చేయడం తగదని అన్నారు. నాగబాబు మనసులో ఏదీ దాచుకోలేడని, అందుకే ప్రీలాంచ్ వేడుక సందర్భంగా రాంగోపాల్ వర్మ గురించి గట్టిగా మాట్లాడాడని తెలిపారు. పవన్ కల్యాణ్ గురించి కూడా వర్మ పలు విమర్శలు చేశాడని, ఆయన ఎవరినీ వదలట్లేదని చెప్పారు.