సౌందర్యకు కొడుకు పుట్టాడు..

7 May, 2015 10:32 IST|Sakshi
సౌందర్యకు కొడుకు పుట్టాడు..

చెన్నై: ప్రముఖ నటుడు రజనీకాంత్ మరోసారి తాత ప్రమోషన్ కొట్టేశారు. ఆయన చిన్న కుమార్తె సౌందర్య బుధవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే తాత హోదాలో ఉన్న ఆయన ఈసారి బుజ్జి మనవడు పుట్టడంతో సంతోషంతో ఉన్నారు. ప్రస్తుతం పాపతో పాటు సౌందర్య కూడా క్షేమంగా ఉన్నట్లు రజనీకాంత్ సన్నిహితుడొకరు తెలిపారు. 2010లో ప్రముఖ వ్యాపారవేత్త అశ్విన్ రామ్కుమార్తో సౌందర్య వివాహం జరిగింది. వీరిద్దరికి ఇదే తొలి సంతానం. కాగా రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య...ప్రముఖ తమిళ హీరో ధనుష్ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం విదితమే. వారిద్దరికీ ఇద్దరు కుమారులు.

ఇక రజనీ కాంత్ నటించిన 3డి యానిమేషన్ చిత్రం కోచ్చడయాన్ చిత్రం ద్వారా సౌందర్య దర్శకురాలిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో రజనీకాంత్ 'తన కూతుళ్లు కష్టపడి సంపాదించాల్సిన అవసరం లేదు. తాను సంపాదించింది వృథా చేయకుండా ఉంటే చాలు వారు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా'నని అన్నారు. అదే వేదికపై తన నాన్న మాటను పాటిస్తానని సౌందర్య తెలిపింది. పెళ్లి అయిన నాలుగేళ్లకు పైగా సంతానానికి దూరంగా ఉన్న సౌందర్య.. తండ్రి మాటను తూచా తప్పకుండా పాటించి  బుజ్జిబాబుకు జన్మనిచ్చింది.