అమితాబ్‌కు వాళ్ళమ్మాయి గుర్తొచ్చింది!

6 May, 2015 00:28 IST|Sakshi
అమితాబ్‌కు వాళ్ళమ్మాయి గుర్తొచ్చింది!

ఇటీవల ఎటుచూసినా నటి దీపికా పదుకొనే కనిపిస్తున్నారు. ‘మై ఛాయిస్’ వీడియో అందుకు ఒక కారణమైతే, ఈ వారంలోనే రానున్న కొత్త సినిమా ‘పీకూ’ మరో కారణం. ‘మై ఛాయిస్’ వీడియో వివాదం గురించి కాసేపు పక్కన పెడితే, శూజిత్ సర్కార్ రూపొందిస్తున్న ‘పీకూ’లో అమితాబ్, దీపిక తండ్రీ కూతుళ్ళుగా నటించారు. అభినయ ప్రధానమైన ఈ సినిమా కేవలం తండ్రీ కూతుళ్ళ మధ్య ప్రేమ మీదే కాక, సర్వసాధారణంగా మనం మన తల్లితండ్రులతో మాట్లాడడానికి వెనుకాడే అంశాల మీదా దృష్టి పెడుతున్నట్లు దీపికా పదుకొనే చెప్పారు.
 
 ‘‘ఈ సినిమా కథ చెప్పగానే ఎప్పుడెప్పుడు చేద్దామా అనిపించింది. మునుపెన్నడూ ఏ సినిమా స్క్రిప్ట్‌కూ నాకు ఇలాంటి ఉద్వేగం కలగలేదు’’ అని ఈ ముద్దుగుమ్మ చెప్పారు. ‘‘ఒక స్వతంత్ర మహిళ ఒకపక్కన తన తండ్రి బాగోగులు, ఇంటి విషయాలు చూసుకుంటూ, మరోపక్క ఉద్యోగం చేయడమనే అంశాన్ని ఇందులో బాగా చూపారు. గతంలో అమితాబ్‌తో కలసి ఒక సినిమాలో చేసినందు వల్ల మా మధ్య మంచి బంధం ఉంది’’ అని దీపిక చెప్పారు. ‘‘ప్రతి ఏటా దీపావళికి అమితాబ్ నన్ను వాళ్ళ ఇంటికి పిలుస్తుంటారు.
 
 నిజజీవితంలో కూడా అమితాబ్ దంపతులకు నన్ను చూస్తే వాళ్ళమ్మాయి శ్వేత గుర్తొస్తుందట. ఆ మాటే వారిద్దరూ చెబుతుంటారు’’ అని ఈ లలితాంగి గుర్తు చేసుకున్నారు. అమితాబ్‌కు సొంత కూతుర్ని గుర్తుచేస్తున్న దీపిక వెండితెరపై అదే పాత్రను ఎలా పోషించారో చూడాలి!