ఇవాంకా జర్నీ..సునీత కామెంట్‌

24 Nov, 2017 10:05 IST|Sakshi

సాక్షి,ముంబై: హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల సదస్సు-2017’ పై సామాన్యుడినుంచి సెలబ్రిటీలదాకా తమదైన  రీతిలో స్పందిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో  తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న హడావిడి, వివిధ ప్రాంతాల్లో  జరుగుతున్న హంగామాపై  ఇప్పటికే చాలామంది సెటైరికల్‌గా  స్పందించారు. ఇరువైపులా పెయింటింగ్‌లు, పచ్చదనంతో ముచ్చటేస్తున్న రోడ్లను చూసి.. తమ రోడ్లకు ఆ భాగ్యం కలిగితే బావుండు అన్నట్టు స్పందించారు. తాజాగా టాలీవుడ్‌ గాయని సునీత కూడా సోషల్‌ మీడియాలో  స్పందించారు.  

‘‘ట్రంప్‌ కూతురు ఇవాంక రాయదుర్గం- ఖాజాగూడ రోడ్డు గుండా రావడం లేదేమో.. వస్తే బావుండు’’ అంటూ ఫేస్‌బుక్‌లో  ఒక పోస్ట్‌ పెట్టారు. ఈ ముస్తాబంతా ఇవాంక ప్రయాణించే మార్గాలకే పరిమితమా? అన్నట్టుగా  సింగర్ సునీత చేసిన కామెంట్‌పై నెటిజన్ల నుంచి  విశేష స్పందన వస్తోంది.

కాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకకు ఘనంగా స్వాగతం పలికేందుకు సర్వహంగులతో సిద్ధంగా ఉంది  ప్రభుత్వం. అటు సెక్యూరిటీపరంగా, ఇటు ముస్తాబు పరంగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి.   ఆమె పర్యటించే ప్రాంతాలన్నీ కొత్త కళను సంతరించుకుంటున్నాయి. ఐటీ కారిడార్‌, పాతబస్తీలోని రోడ్లన్నీ తళతళా మెరిసిపోతున్న సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు