చరిత్రలో నిలిచిపోతుంది

24 Aug, 2013 00:28 IST|Sakshi
చరిత్రలో నిలిచిపోతుంది
 ‘‘ఎన్నో వందల, వేల సినిమాలొస్తున్నాయి. ఏ సినిమా ప్రేక్షకులను ఎలా ప్రభావితం చేస్తోందో మనకు తెలుసు. అలాగే ఏ సినిమాని ఎలా ఆదరించాలో కూడా ప్రేక్షకులకు తెలుసు. సినిమా తీసేవాళ్లల్లో ఎంత సంస్కారం ఉండాలో, చూసేవాళ్లలో కూడా అంతే సంస్కారం ఉండాలి’’ అన్నారు పరిపూర్ణానంద స్వామి.
 
 గ్లోబల్ సినీ క్రియేటర్స్ పతాకంపై జేకే భారవి దర్శకత్వంలో శ్రీమతి నారా జయశ్రీదేవి నిర్మించిన చిత్రం ‘జగద్గురు ఆదిశంకర’ ఇటీవల విడుదలైంది. టైటిల్ రోల్‌ని కౌశిక్‌బాబు, ఇతర ప్రధాన పాత్రలను నాగార్జున, శ్రీహరి, సాయికుమార్ తదితరులు పోషించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం విజయోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ -‘‘ప్రతి హిందువు, భారతీయుడు చూడాల్సిన సినిమా.
 
 ఆదిశంకర జీవితాన్ని భారవి చాలా స్పష్టంగా తెరకెక్కించాడు. ఈ సినిమా చేసి భారవ సాహసం చేయలేదు, తపస్సు చేశాడు. చరిత్రలో నిలిచిపోయే సినిమా. నేటి తరంలో ఇలాంటి సినిమా రావడం, అది ప్రేక్షకాదరణ పొందడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ సమావేశంలో జయశ్రీదేవి, భారవి, కౌశిక్, నాగ్ శ్రీవత్స, రాజా రవీంద్ర, ఉదయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.