యాత్రలో జగపతిబాబు

3 Jul, 2018 00:28 IST|Sakshi
జగపతిబాబు

వైఎస్‌ రాజారెడ్డి.. ఈ పేరు చెప్పగానే దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తండ్రి అని గుర్తుకొస్తారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో రాజారెడ్డి అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకంటే.. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘యాత్ర’. వైఎస్‌ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి నటిస్తున్నారు. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్‌ మహీ వి. రాఘవ్‌ దర్శకత్వంలో 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో వైఎస్‌ తండ్రి రాజారెడ్డి పాత్రలో విలక్షణ నటుడు జగపతిబాబు కనిపించనున్నారు. రాజారెడ్డి అంటే రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా పులివెందుల ప్రాంత ప్రజలకు ఎనలేని అభిమానం. అటువంటి రాజారెడ్డి పాత్రకు జగపతిబాబు అయితే కరెక్టుగా సరిపోతారని భావించిన చిత్రబృందం ఆయన్ను సంప్రదించడం, ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం జరిగిపోయాయి. ఆదివారం రాత్రి దర్శక–నిర్మాతలతో మాట్లాడాక జగపతిబాబు ఈ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. త్వరలోనే లుక్‌ టెస్ట్‌ చేయనున్నారు. కాగా ఈ చిత్రంలో మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని నటిస్తోన్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు